దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్గ్యాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. ఏప్రిల్ 6నుంచి సీయూఈటీ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్టీఏ ఆదివారం వెల్లడించింది. విద్యార్థులు http://cuet.samarth.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ మే 6 రాత్రి 11.50 గంటలకు ముగుస్తుందని పేర్కొంది.
ఎన్టీఏ గత నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 2,2022 నుంచే సీయూఈటీ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఎన్టీఏ దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. పరీక్ష తేదీలు ఇంకా వెల్లడించలేదు. జూలై 2022 మొదటి లేదా రెండో వారంలో సీయూఈటీ 2022 ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.