తిరుపతి, మే 30: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
కాగా వసంతోత్సవాల్లో చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.