తిరుపతి, మే 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు ఈరోజు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.
మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.