మణికొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ స్పష్టంచేశారు. గండిపేట చెరువు కట్టపై హెచ్యండీఏ ఆధ్వర్యంలో రూ.27 కోట్ల నిధులతో నిర్మిస్తున్న పరివాహక సుందరీకరణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా చెరువు కట్టపై నిర్మిస్తున్న ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ రూం, గార్డ్ రూం, సెంట్రల్ పెవిలియన్, ఓఏఏటీ(ఆర్ట్ పెవిలియన్), టాయిలెట్స్, కిడ్స్ ప్లేయింగ్, పార్కు నిర్మాణాల వివరాలను హెచ్యండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులు త్వరితగతిన పూర్తి చేసి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. అనంతరం చెరువు కట్టపైకి వెళ్లిన ఎమ్మెల్యే నీటిమట్టం వివరాలను జలమండలి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో భవిష్యత్తు తరాలకు ఉజ్వళమైన భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో వందేళ్లు పూర్తిచేసుకున్న గండిపేట చెరువుకు పర్యాటక శోభను తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవచూపుతున్నారని తెలిపారు.
ఏడేళ్లకాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుందని, ఏనాడు ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా సర్కారు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతియేటా ప్రజల ఆశీస్సులతో పుష్కలమైన వర్షాలను భగవంతుడు అందిస్తూ అన్నదాతల నుంచి అన్నివర్గాల వారు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. నగరవాసులకు దాహార్తి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను సర్కారు తీసుకువచ్చి అందిస్తుందన్నారు. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్లు నిండుకుండలా అందుబాటులో తాగునీటితో సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రజలకు మరో ఐదేళ్ల వరకు నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
గండిపేట చెరువు కట్టపై రూ. 27 కోట్ల నిధులతో హెచ్యండీఏ చేపట్టిన సుందరీకరణ పనులు డిసెంబర్ నాటికి పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో గండిపేటలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను చెరువు చుట్టూ ఏర్పాటు చేసే దిశగా సర్కారు యోచిస్తుందన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పనులను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ జి.వెంకటేష్యాదవ్, హెచ్యండీఏ ఈఈ పద్మ,డీఈ దేవెందర్రెడ్డి, ఏఈ జీవన్, కౌన్సిలర్లు విజేతప్రశాంత్యాదవ్, సునీతగణేష్కుమార్, శివారెడ్డి, ఆదిత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.