మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోరకమైన సమాధానం చెప్తుంటారు. ఈ ప్రపంచం మాయ అని భావించేవాళ్లు, మనం ఎక్కడినుంచి వచ్చామో అక్కడికే చేరుతామనుకుంటారు. మనం శూన్యం (ఏమీలేని వస్తువు) నుంచి వచ్చాం కాబట్టి శూన్యంలోకే పోతామని అభిప్రాయపడతారు శూన్యవాదులు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. మనం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి, అతనిలోనే కలిసిపోతామని కొందరు ఆధ్యాత్మికవాదుల అభిప్రాయం. ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు అభ్యుదయవాదులు. పరలోక సుఖమే తమ లక్ష్యం అంటారు మతవాదులు. ఈ విధంగా ఎవరికి వారు మానవుడి లక్ష్యాన్ని వారు కోరుకున్నట్లుగా పేర్కొంటారు.
జీవరాశులన్నిటిలో మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతర ప్రాణులకు లేని లక్ష్యం మానవుడికి ఉన్నది. నాలుగు పురుషార్థాల్లో అర్థకామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లూ ఉన్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మగ్రంథమూ చెప్పదు. అయితే, ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను శాస్ర్తాలు బోధిస్తున్నాయి. అందుకే, పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు. తనకే కాక, తోటి ప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది స్వార్థమవుతుంది. ఆచారం వ్యక్తిగతమైంది కావొచ్చు కానీ, ధర్మం సర్వనిష్ఠమైంది. అందరికీ ఆమోదయోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారి బత్తెంగా చేసుకొని ప్రయాణించేవారికి ధనప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతిమంగా మోక్షమూ ప్రాప్తిస్తుంది. మోక్షాన్ని సాధించడమే మానవుడి పరమలక్ష్యం అని తెలుస్తుంది.
ఫలాపేక్షతో చేసే కర్మలు మనల్ని మరిన్ని జన్మలు ఎత్తేటట్లు చేసి, వివిధ శరీరాల్లో బంధిస్తాయి. ఇక, నిష్కామ బుద్ధితో చేసే కర్మలు బంధరాహిత్యానికి తోడ్పడి, మోక్షానికి దారిచూపుతాయి. పరహిత కర్మలు పరోక్షంగా మోక్షానికి మార్గం సుగమం చేస్తే, యథార్థ జ్ఞానం ప్రత్యక్షంగా మానవుడికి పరమ లక్ష్యమైన మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. అందుకే విద్వాంసులు ‘కర్మలు చేయకుండా ఉండకండి. కానీ, కర్మఫలాలు కోరుకోకండి’ అని ఉద్బోధిస్తుంటారు. ఒకవిధంగా మనల్ని కర్మ బంధిస్తుంది. అదే సమయంలో నిష్కామ బుద్ధితో చేసే సత్కర్మ మనల్ని బంధనాల నుంచి బయటపడేలా చేస్తుంది. బంధనానికి దుఃఖమని, మోక్షానికి ఆనందమని వ్యవహారం ఉన్నది. సంసారంలో బందీ అయిన మనకు కేవలం దుఃఖమే ఉందా అంటే అది సరైన సమాధానం కాదు. దుఃఖంతోపాటు సుఖం కూడా ఉంది. సంసారంలో ఎంత సుఖపడినా పర్యవసానం దుఃఖమే! కాబట్టి ఆ దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించుకునే మార్గాన్ని అన్వేషించమన్నారు పెద్దలు. దాన్నే మోక్షం అన్నారు. మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయడటపడటమే మోక్షం. అదే మానవుడి పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కానీ, వాటినుంచి బయటపడటానికి కేవలం కార్మికుడైతే లాభం లేదు, ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఇందులో బందీగా ఉన్న తాను ఎవరో తెలుసుకోవాలి. అది తెలిస్తే గానీ పరమలక్ష్యం అందుకోలేం.
మనకు అపర, పర అని రెండు విద్యలున్నాయి. యజ్ఞయాగాదులు, వేదాది శాస్త్ర అధ్యయనాలు, మనం చేసే ఇతర కర్మలు అపరవిద్యకు సంబంధించినవి. సత్యభాషణ, సత్యాచరణ, ప్రకృతి పురుష వివేకం, బ్రహ్మచర్యం ఇవి పరావిద్య. జ్ఞానులు పరావిద్యను ఆశ్రయిస్తారు. సత్యవాక్కును వెలువరించడమే సత్యభాషణ. త్రికరణాలను ధర్మబద్ధమైన జీవనానికి అంకితం చేయడమే సత్యాచరణ. యోగమార్గంలో నడవడమే బ్రహ్మచర్యం. జడ ప్రపంచం కన్నా పరమ చైతన్యం. పరమాత్మ భిన్నమైనవాడని తెలుసుకోవడం ప్రకృతి పురుష వివేకం. ఈ నాలుగు సుగుణాలతో కూడుకున్నదే పరావిద్య. పరావిద్యతో లభించేదే మోక్షం. అదే మానవుడి పరమ లక్ష్యం.
– ఆచార్య మసన చెన్నప్ప
98856 54381