Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం విలవిల్లాడాయి. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికతో ఈ రోజు ప్రారంభం నుంచి స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మూడు నెలల కనిష్టం వద్ద స్థిర పడ్డాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం ప్రభావం ఓవరాల్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. అదానీ గ్రూప్ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.2 లక్షల కోట్లు హరించకుపోయింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 874 పాయింట్లు నష్టపోయి 59,331 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఇది 2022 అక్టోబర్ 21 తర్వాత కనిష్టం. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 59,307 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 288 పాయింట్ల నష్టంతో 17,604 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో అదానీ గ్రూప్లోని అదానీ ఎంటర్ప్రైజెస్ 18 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం నష్టాలను చవి చూశాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఐదు శాతం వరకు పతనం అయ్యాయి. అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్స్ షేర్లు 5-20 శాతం మధ్య నష్టపోయాయి.
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో ఏడాది కాలంగా అదానీ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై స్టాక్మార్కెట్ల నియంత్రణ సంస్థ `సెబీ` తనిఖీలు పెంచనున్నది. అదానీ గ్రూప్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పాత్రపై సెబీ దర్యాప్తు చేపట్టనున్నదని సమాచారం. డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టాటా మోటార్స్ (ఆరు శాతం), బజాజ్ ఆటో (5.8 శాతం), డాక్టర్ రెడ్డీస్ (మూడు శాతం వరకు) లబ్ధి పొందాయి. వీటి వల్లే దేశీయ స్టాక్మార్కెట్ల భారీ పతనం నిలిచిపోయింది. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు కాసింత లాభ పడ్డాయి. నిఫ్టీ పీఎస్బీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు ఐదు శాతం చొప్పున పతనం అయ్యాయి.