హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణభవన్లో గత గురువారం కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘కల్వకుర్తి నియోజకర్గంలో బీజేపీ నాయకుడు.. పొద్దున లేస్తే తాను మోదీతోనే ఉంటానని చెప్పుకొనే పెద్ద నాయకుడు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తమ వాటా ఉన్నదని నిస్సిగ్గుగా చెప్తారు’ అని తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ సమావేశంలో ‘విశ్వబ్రాహ్మణులను (చారీలను) తాను కించపరిచినట్టు కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం’ అని శనివారం ఒక ప్రకటనలో మంత్రి కేటీఆర్ వివరించారు. ‘ఒక కులాన్ని లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదు. కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటను ఉసంహరించుకుంటున్నాను’ అని ఆయన ప్రకటించారు.