ఎనిమిది మంది సంతానం గల కుటుంబం నుంచి వచ్చిన ఆ కుర్రాడు.. ఏదో ఒకటి సాధించాలనే తపనతో చిన్నప్పుడే చేతికి గ్లౌజ్లు తొడిగాడు. నాన్న బాక్సింగ్లో ఓనమాలు నేర్పిస్తే.. అన్న దారి చూపాడు! అదే మార్గంలో ముందుకు సాగిన ఆ కుర్రాడు చూస్తుండగానే జూనియర్ లెవల్లో సంచలనాలు సృష్టించడంతో పాటు సీనియర్ నేషనల్ చాంపియన్గా నిలిచాడు.టోర్నీ ఏదైనా తన పంచ్ పవర్తో ప్రత్యర్థిని మట్టి కరిపించే వరకు వదలని ఆ బాక్సర్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకంతో మెరిశాడు. నిజామాబాద్లో పుట్టి.. నైపుణ్యమే పెట్టుబడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్పై ప్రత్యేక కథనం..
తండ్రి బాక్సింగ్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే గాల్లో పంచ్లు విసురుతూ గడిపిన హుస్సాముద్దీన్.. సోదరులు జాతీయ స్థాయి బాక్సర్లుగా గుర్తింపు సాధించడంతో రింగ్పై మక్కువ పెంచుకున్నాడు. పాఠశాలకు వెళ్తూనే ఉదయం, సాయంత్రం బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన హుసామ్.. 2009లో తొలిసారి జాతీయ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు.
హుసాముద్దీన్ తండ్రి సమ్సముద్దీన్కు ఎనిమిది మంది సంతానం కాగా.. అందులో హుసామ్ ఆరోవాడు. ఇద్దరు సోదరులు అప్పటికే స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంతో హుసామ్ కూడా శిక్షణపై దృష్టి సారించాడు. అలా ఇందూరు నుంచి ప్రారంభమైన హుసామ్ ప్రస్థానం.. దశాబ్ద కాలంగా నిరాటంకంగా సాగుతున్నది.
పంచ్లో మంచి పవర్ ఉండటంతో తండ్రి అతడిని మరింత సానబెట్టాడు. ఫలితంగా హుసామ్ జూనియర్ స్థాయిలో వరుసగా నాలుగేండ్ల పాటు పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. దీంతో పిన్న వయసులోనే క్రీడా కోటా కింద ఆర్మీలో చేరాడు. సీనియర్ స్థాయిలో 57 కేజీల విభాగంలో పోటీలు ప్రారంభించిన హుసామ్.. 2015లో కొరియా వేదికగా జరిగిన ప్రపంచ మిలటరీ గేమ్స్లో కాంస్యం సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అత్యుత్తమ స్థాయి బాక్సర్లు పాల్గొనే టోర్నీలో పతకం నెగ్గడంతో అతడి ఆత్మవిశ్వాసం పెరిగింది.
హుసామ్లో ఉన్న ప్రతిభను గుర్తించిన భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్).. అతడిని మరింత సానబెడితే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి మెరుగైన శిక్షణ ఇప్పించాయి. ఫలితంగా 2018 గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హుసామ్ కాంస్య పతకంతో మెరిశాడు. సెమీస్లో కంటిపై తీవ్రగాయమై రక్తమోడుతున్నా.. రింగ్ వీడక పోరాడిన అతడి తెగువకు ఎన్ని మెడల్స్ ఇచ్చినా తక్కువే. చివరి వరకు ఈ పట్టువీడని తత్వమే హుసామ్ను విజేతగా నిలిపింది.
తాజాగా ముగిసిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన హుసాముద్దీన్ సెమీస్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇది తన స్థాయికి తగ్గ ప్రదర్శన కాదని బౌట్ ముగిసిన వెంటనే పేర్కొన్న హుసామ్.. కామన్వెల్త్ తొలి రౌండ్లో చేతి వేలికి గాయమైనా.. ఆ బాధను పంటిబిగువున భరిస్తూ ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపించాడు. స్వతహాగా ఎడమచేతి వాటమైనప్పటికీ.. కుడిచేత్తోనూ సమానమైన పవర్ పంచ్లు విసురుతూ ప్రత్యర్థిని తికమక పెట్టడం హుసామ్కు వెన్నతో పెట్టిన విద్య.
బర్మింగ్హామ్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన హుసాముద్దీన్తో పాటు.. మహిళల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకున్న నిఖత్ జరీన్కు బాక్సింగ్లో ఓనమాలు నేర్పింది సమ్సముద్దీనే. స్వతహాగా బాక్సరైన సమ్సముద్దీన్ తన కుమారులతో పాటు తొలినాళ్లలో నిఖత్కు కోచ్గా వ్యవహరించారు. ఆయన శిష్యరికంలోనే హుక్ షాట్లో రాటుదేలిన నిఖత్.. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్గా పేరు ప్రఖ్యాతులు సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్లో పతకం నెగ్గడం ఆనందంగా ఉంది. గోల్డ్కోస్ట్ (2018) లోనూ కాంస్యం సాధించా.. ఈసారి పతకం రంగు మార్చాలనుకున్నా అది సాధ్యపడలేదు. భవిష్యత్తులో మరింత బలంగా పోరాడుతూ. 2024 పారిస్ ఒలింపిక్స్లో మెడల్ నెగ్గడమే నా అంతిమ లక్ష్యం. అందుకోసం ప్రణాళిక ప్రకారం సిద్ధమవుతున్నా. గోల్డ్కోస్ట్ పతకం నెగ్గిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని మర్చిపోలేను. మరింత సహకారం లభిస్తే.. మున్ముందు రాష్ర్టానికి, దేశానికి వరుస పతకాలు అందిస్తా.
– హుసాముద్దీన్