హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు టీజీవో నేతలు మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్లను కలిసి మద్దతు ప్రకటనను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్తోనే సాధ్యం అన్నారు. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు.
ఉద్యోగులు అడిగినదానికన్నా ఎక్కువ ఇచ్చి గౌరవించుకునే మంచి మనసున్న మనిషి మన సీఎం అన్నారు. కేవలం ఆరేళ్లలో లక్షా ముప్పై మూడు వేలకు పైగా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ర్టానిదేనన్నారు. ఉద్యోగులకు కేసీఆర్కు ఉన్నది పేగుబంధమని, ఉద్యోగుల మేలునే ఎప్పుడు తమ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకొని సీఎం వద్ద గర్వంగా సమస్యల్ని పరిష్కరించుకుందామన్నారు.
టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ మాట్లాడుతూ.. టీజీవోలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం విడదీయరానిదన్నారు. ఒకే నెలలో 32 వేల ప్రమోషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. తమ అన్ని కోరికలను త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. కావునా విద్యావేత్తయిన వాణీదేవికే టీజీవోల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో కోశాధికారి పి.రవీందర్కుమార్, సహధ్యక్షులు ఎస్.సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్.బి.కృష్ణయాదవ్, నగరశాఖ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు బి. వెంకటయ్య, ప్రణయ్కుమార్, హరికృష్ణ, శిరీష, రేవతి, ప్రదీప్, గోపాలకృష్ణ, గోపిచంద్, దేవేందర్ ఇంకా పెద్ద ఎత్తున టీజీవో నాయకులు పాల్గొన్నారు.