ముంబై, జూన్ 26: ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా తయారు చేసిన రెండు మోడళ్ల కార్లను రీకాల్ చేయనున్నది. ఈ రెండు మోడళ్లు కూడా చైనాలో తయారవ్వడం విశేషం. చైనా రెగ్యులేట్స్ ఆదేశాల మేరకు వాటిని రీకాల్ చేయనున్నట్లు టెస్లా వెల్లడించింది. ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేసిన వారు తమ వాహనాలను అప్గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కారణంతోనే రీకాల్ చేసినట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ టెస్లా ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేయడంలో టాప్ ఆటొమొబైల్ కంపెనీగా ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే.
చైనాలో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. మోడల్ 3, మోడల్ వై కార్లు చైనాలోనే తయారయ్యాయి. మోడల్ 3 కారు ధర భారత్లో 60 లక్షల రూపాయలు ఉంటోంది. కాగా. మోడల్ వై ప్రైస్ 50 లక్షలకు పైమాటే. ఈరెండు మోడల్స్ను టెస్లా కంపెనీ యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ రెండు మోడళ్ల కార్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉన్నందున.. వాటిని రీకాల్ చేసినట్లు టెస్లా తెలిపింది. మొత్తం 2,49,855 కార్లను రీకాల్ చేసినట్లు పేర్కొంది.
కొనుగోలుదారులు వాటిని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుని, మళ్లీ తిరిగి పొందవచ్చని స్పష్టం చేసింది. సడన్ యాక్సిలరేషన్ సమస్యలు ఉన్నందున దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చైనా రెగ్యులేటర్స్ ఆదేశించినట్లు తెలిపింది. సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుందని పేర్కొంది. ఈ రెండు మోడళ్లను తొలిసారిగా షాంఘైలో తయారు చేస్తోంది టెస్లా కంపెనీ. ఒక్క మేలోనే 33,463 కార్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఈ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు వివరించింది.