శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని జైన్పోరాలోని క్రాల్చక్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. కాల్పుల్లో జవాన్ అజయ్ కుమార్ చేతికి బుల్లెట్ గాయమైందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపాయి.
అనంతరం ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా స్థలంలో జవాన్లకు తూటాలు లభ్యమయ్యాయి. కాగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాశ్మీర్లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని, హజ్రత్బల్ దేవాలయాన్ని సందర్శించనున్నారు. శ్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం అనంత్నగర్ జిల్లాలో బీజేపీ సర్పంచ్తో పాటు అతని భార్యపై కాల్పులు జరుపడంతో ఇద్దరూ మృతి చెందారు.