శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలపాటు పౌర అశాంతికి దారితీసింది. సుమారు వంద మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. కాగా, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వాని ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. పుల్వామాలోని త్రాల్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు.
అయితే, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని జమ్ముకశ్మీర్ పరిపాలన యంత్రాంగం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెడ్మాస్టర్ అయిన ఉగ్రవాది బుర్హాన్ వాని తండ్రి ముజఫర్ వాని స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మరోవైపు, జమ్ముకశ్మీర్లో 23 వేల వరకు స్కూళ్లు ఉన్నాయి. అయితే చాలా స్కూళ్లలో జాతీయ జెండాలను ఎగురవేయలేదు. జమ్ముకశ్మీర్లో గతంలో జాతీయ జెండా ఆవిష్కరణలు జరిగేవి కావు. అయితే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది జరిగి రెండేండ్లైన తర్వాత ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది.