న్యూఢిల్లీ : 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూను సైతం గుర్తు చేశారు. మోదీ 90 నిమిషాల పాటు ప్రసంగించగా.. ఇందులో రెండు కీలక ప్రకటన చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.100లక్షల కోట్లతో గతశక్తి యోజన, దేశంలో బాలికల కోసం అన్ని సైనిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశం మారుతోంది, భారతదేశం మారవచ్చని.. భారతదేశం కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చని.. వెనుకాడదు.. ఆగదని స్పష్టం చేశారు.
నెహ్రూనూ స్మరించిన మోదీ
ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్వాతంత్య్ర సమరయోధులతో పాటు మాజీ ప్రధాని నెహ్రూను స్మరించారు. స్వాతంత్ర్యాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన మహాత్మా గాంధీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. భగత్ సింగ్, ఆజాద్, బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, లక్ష్మీ బాయి, దేశ తొలి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్ దిశానిర్దేశం చేశారన్నారు. దేశం ప్రతి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుంటుంది. దేశం ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటుందన్నారు.
చప్పట్లు కొట్టి ఒలింపిక్స్ విజేతలకు అభినందన..
టోక్యో ఒలిపింక్స్లో ప్రధాని ప్రశంసించారు. ఒలింపిక్స్లో భారత్ కు కీర్తితెచ్చిన యువ తరం క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారని.. కొన్ని క్షణాల పాటు కరతాళ ధ్వనులతో ఆటగాళ్లను గౌరవించాలని యావత్ దేశ ప్రజలను కోరారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అన్నారు. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తు వారికి గౌరవం ప్రకటిస్తోందన్నారు. వాళ్లు పతకాలు మాత్రమే సాధించలేదు.. నవ తరానికి స్ఫూర్తినిచ్చే గొప్ప పని చేశారని, దీనికి గర్వపడవచ్చన్నారు.
రూ.100లక్షల కోట్ల గతి శక్తి యోజన ప్రకటన
దేశంలో గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ తీసుకురానున్నట్లు మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్లకు పథకం లక్షలాది మంది యువతకు ఉపాధిని అందిస్తుందన్నారు. గతి శక్తి దేశానికి జాతీయ మౌలిక సదుపాయాల ప్రధాన ప్రణాళిక అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థకు సమగ్ర బాటలు అందిస్తుందని చెప్పారు. స్పీడ్ పవర్ అన్ని అడ్డంకులు, ఇబ్బందులను తొలగిస్తుందని, సామాన్యుల ప్రయాణ సమయం తగ్గిస్తుందని చెప్పారు. తయారీదారులకు సహాయం అందుతుందన్నారు.
జాతీయ హైడ్రోజన్ మిషన్ ప్రకటన
ప్రధాని ఎర్రకోటపై నుంచి నేషనల్ హైడ్రోజన్ మిషన్ను ప్రకటించారు. అమృత కాలంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతికి హబ్గా తీర్చిదిద్దాలన్నారు. భారతదేశాన్ని స్వయం శక్తిపై ఆధారపడేలా చేస్తుందని.. పరిశుభ్రమైన శక్తి, పరిశుభ్రమైన ఉద్యోగావకాశాలకు ఈ రంగం యువత, స్టార్టప్లకు తోడందిస్తోందన్నారు. స్వచ్ఛ శక్తి, స్వచ్ఛ ఎదుగుదల, స్వచ్ఛమైన ఉద్యోగ అవకాశాలను యువతతో పాటు స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
బాలికల కోసం సైనిక్ స్కూళ్లు..
క్రీడలతో పాటు ప్రతిచోటా ఆడ పిల్లలు అద్భుతాలు చేస్తున్నారని మోదీ అన్నారు. నేడు దేశంలో ఆడపిల్లలు వారి స్థానాన్ని పొందేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. రహదారి నుంచి కార్యాలయం వరకు.. మహిళలకు భద్రత, గౌరవం ఉండాలని.. ఇందుకు పరిపాలన, పోలీసులు, పౌరులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. చాలా మంది బాలికలు నాకు లేఖలు రాస్తున్నారు. అందుకే ఇక నుంచి బాలికల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కిందట తొలిసారి ప్రయోగాత్మకంగా మిజోరంలోని సైనిక్ స్కూల్లో బాలికలను అనుమతించామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా తెరువనున్నట్లు చెప్పారు.
విభజన శతాబ్దంలో అతిపెద్ద విషాదాల్లో ఒకటి..
ప్రతి ఏడాది ఆగస్ట్ 14న విభజన గాయాల స్మారక దినోత్సవం జరుపుకుందామన్నారు. గత శతాబ్దంలో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఇది ఒకటి అన్నారు. స్వాతంత్య్రం తర్వాత ప్రజలు చాలా త్వరగా మరిచిపోయారని.. నిన్న మాత్రమే భారతదేశం భావోద్వేగ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15ప విభజన గాయాల స్మారక దినంగా గుర్తుంచుకుంటారన్నారు. విభజన సమయంలో ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారి చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయన్నారు. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేతు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయన్నారు.
కొత్త మంత్రం.. సబ్కా ప్రయాస్
ఎర్రకోట వేదికగా కొత్త మంత్రాన్ని ప్రధాని పిలుపునిచ్చారు. స్వావలంభన భారతదేశాన్ని నిర్మించేందుకు సబ్ కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్తో పాటు ‘సబ్కా ప్రయాస్’ (అందరి ప్రయత్నాలు) కోసం ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించాలనే లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలన్నారు. ఇందుకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్తో పాటు ‘సబ్కా ప్రయాస్’ కీలకమైనవన్నారు. గత ఏడు సంవత్సరాల్లో ప్రారంభించిన అనేక పథకాల ప్రయోజనాలు కోట్ల మంది నిరుపేదల ఇండ్లకు చేరాయని.. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ శక్తి దేశానికి తెలుసన్నారు.
పేదలకు పౌష్టికాహారం
పేద పిల్లల్లో పోషకాహార లోపంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, దేశంలోని ప్రతి పేదవారికి పౌష్టికాహారం అందించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. పేద పిల్లలలో పోషకాహార లోపం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం తన విభిన్న పథకాల కింద పేదలకు ఇచ్చే బియ్యాన్ని పోషకంగా మారుస్తుందని, రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం, ప్రతి పథకం కింద లభించే బియ్యం 2024 నాటికి పోషకాహారంగా మార్చనున్నట్లు తెలిపారు.
ఆక్సిజన్ ప్లాంట్ల పెంపు
వైద్య విద్యలో అవసరమైన సంస్కరణలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వం మెరుగుపరిచిందని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, దేశంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి వారికి చౌకగా వైద్యం అందుతోందని, 75వేలకంటే ఎక్కువ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెరుగైన ఆసుపత్రులు. ఆధునిక ల్యాబ్ల నెట్వర్క్లో పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలో దేశంలోని వేలాది ఆసుపత్రులు తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను కలిగి ఉంటాయన్నారు.
21వ శతాబ్దంలో కొత్త శిఖరాలకు
21వ శతాబ్దంలో భారత్ కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. భారత దేశ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉప వినియోగించుకోవడం అవసరమన్నారు. వ్యవసాయ రంగంలో ఇంకా నూతన సంస్కరణలు అవసరమన్నారు. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గుతోందన్నారు. దేశంలో 80శాతం రైతులు ఐదెకరాల్లోపు భూమి కలిగిన వారేనని, కుటుంబాల నిరంతర విఘటనతో భూకమతాల పరిమాణం తగ్గుతోందన్నారు. చిన్న రైతులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ పథకాలను మార్చుకోవాలన్నారు. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఓబీసీలకు రిజర్వేషన్లు కేటాయించామని, ఇందుకు జాబితాను రూపొందించడానికి రాష్ట్రాలకే అధికారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.