ఓ ఉద్యానవనంలో తిరుగాడే కప్ప కలుగులో అనుకోకుండా ఒక రోజు ఓ రూపాయి బిళ్ల వచ్చి పడుతుంది. ఇక ఆ రూపాయిని చూసుకున్న మండూకానికి మదం తలకెక్కుతుంది. అప్పటి నుంచి దాని వ్యవహారంలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఇంతలో ఒకసారి ఒక ఏనుగు ఆ కప్ప కలుగు వైపుగా వెళుతూ ఉంటుంది. వెంటనే అది బయటకు వచ్చి ఆ ఏనుగుపైకి కాలు ఎత్తుతూ ‘ఏయ్! ఎంత ధైర్యం నీకు! నా కలుగు మీదుగా వెళతావా?’ అంటూ హూంకరిస్తుంది. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ఇది. ఆకస్మికంగా వచ్చి పడిన సంపదలు ఆ కప్పలా మనల్ని కూడా చాలాసార్లు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించేలా చేస్తాయి. ఉచితానుచితాలు కూడా చూడకుండా తోటివారిని తక్కువ చేసి మాట్లాడిస్తాయి. నడమంత్రపు సిరి అబ్బినవారు ఆహార, ఆహార్యాల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ తెచ్చిపెట్టుకున్న డాంబికాలను ప్రదర్శిస్తూ ఉంటారు. సిరిసంపదలను, అధికార హోదాలను అరాయించుకోవడం కూడా అతిపెద్ద ఆధ్యాత్మిక సాధనే! ఆకస్మికంగా అవి ప్రాప్తించినప్పుడు అడుగులు తడబడకుండా నడవగలగడం నిజమైన స్థితప్రజ్ఞుల లక్షణం. అందుకే, అవి లేని నాడు వారెలా ఉంటారో, ఉన్ననాడూ వాళ్లు అదే మనుషులు, అవే మనసులుగా మసలుతూ ఉంటారు. నడమంత్రాన ఏవి లభించినా నిమిత్తమాత్రులుగానే నడుచుకుంటారు. తెలియక అహంకారానికి పోయినా ఎప్పటికైనా మేలుకుంటేనే మేలు పొందుతారు. – మనోజ్ఞ