హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : సీబీఎస్ఈ సహా ఇతర బోర్డుల పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారిగా తెలుగుభాష పేపర్ను ప్రవేశపెట్టనున్నారు. 2023లో జరిగే వార్షిక పరీక్షల్లో సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తెలుగు పరీక్ష నిర్వహిస్తారు. 2018 19లో తీసుకొచ్చిన ‘తెలుగు తప్పనిసరి అమలు చట్టం’ ద్వారా ఇది అమల్లోకి రానున్నది. వచ్చేఏడాది పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండనున్న నేపథ్యంలో పరీక్షలను సైతం నిర్వహిస్తారు. ఇందుకోసం ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు.
తెలుగుతో పాటు మరోభాష
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) బోర్డుల గుర్తింపు పొందిన పాఠశాలల్లో బహుళభాషా విధానం అమల్లోకి రానున్నది. 1 -4 తరగతుల్లో ఏవైనా రెండుభాషలు, 5 నుంచి 8 వరకు త్రిభాషాసూత్రం ప్రకారం మూడు భాషలు, 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ తప్పనిసరి కాగా, మరో ప్రాంతీయ భాషను విద్యార్థులు ఎంచుకోవచ్చు. తాజాగా మన రాష్ట్రంలో తెలుగు తప్పనిసరికావడంతో పదో తరగతిలోకి ప్రవేశించే వారు ఇంగ్లిష్, తెలుగును మాత్రమే ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఎస్సీఈఆర్టీ అధికారులు మాతృభాషగా చదువుకుంటున్న వారికోసం ‘సింగిడి’, మాతృభాష కాని వాళ్లకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. 2018 నుంచి దశలవారీగా ప్రాథమికస్థాయి, ఉన్నత తరగతుల్లో తెలుగు తప్పనిసరిగా అమలవుతున్నది. 2022 -23 సంవత్సరంలో అన్ని తరగతుల్లో తెలుగు తప్పనిసరి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఎస్సెస్సీ పరీక్షల్లో తెలుగు చేరనున్నది.
ఉల్లంఘిసే కఠిన చర్యలే..
ఏదైనా పాఠశాల ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఫిర్యాదు అందితే, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నోటీసు జారీచేస్తారు. యాజమాన్యం స్పందించని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రూ.50వేల జరిమానా విధించే అవకాశమున్నది. రెండోసారి ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి ఉల్లంఘనైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు.