గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ కొత్తశోభతో అలరారుతున్నది. కరోనా ప్రభావం సద్దుమణగడంతో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఇదే తరుణంలో అగ్రహీరోల చిత్రాలు వడివడిగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్నాయి. ఈ ఉత్సాహాన్ని మహాశివరాత్రి పర్వదినం మరింత ద్విగుణీకృతం చేసింది. ప్రజలందరూ భక్తి పారవశ్యంలో తరిస్తుండగా..ఇదే శుభ తరుణం అంటూ దర్శకనిర్మాతలు పలువురి అగ్ర తారల చిత్రాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్, నయాలుక్స్ను విడుదల చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి..
అభయమిచ్చే భోళాశంకర్
శరణుకోరిన వారికి అభయమిచ్చే భోళాశంకరుడతను.నమ్మకద్రోహం చేస్తే మాత్రం ప్రళయరుద్రుడవుతాడు. అలాంటి ఓ వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత వరకు వెళ్లాడన్నదే మా సినిమా ఇతివృత్తమని చెప్పారు మోహర్ రమేష్. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. మంగళవారం ‘వైబ్ ఆఫ్ భోళా’ అనే పేరుతో ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో స్పోర్ట్స్ జీప్పై కూర్చొని ైస్టెలిష్గా కనిపిస్తున్నారు చిరంజీవి. త్రిశూలం డిజైన్తో ఉన్న కీచైన్ తిప్పుతున్న ఆయన లుక్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తిసురేష్ నటిస్తున్నది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్నా, రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డూడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: తిరుపతి మామిడాల, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహర్ రమేష్.
సర్కార్ యాక్షన్ ధమాకా
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రౌడీల భరతం పడుతూ ఉగ్రరూపంలో కనిపిస్తున్నారాయన. రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఈ పోస్టర్ను చూస్తే అర్థమవుతున్నది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నది. వేసవి కానుకగా మే 12న ప్రేక్షకులముందుకురానుంది. ‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్సింగిల్ ‘కళావతి..’ ఐదుకోట్ల వీక్షణల్ని సాధించింది. యూట్యూబ్తో పాటు సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
డ్యూటీలో రామారావు
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్డ్యూటీ’ టీజర్ మంగళవారం విడుదలైంది. నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే డిప్యూటీ కలెక్టర్ పాత్రలో రవితేజ శక్తివంతంగా కనిపించారు. ‘నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా సరే’ అనే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్, మాస్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వేణు తొట్టెంపూడి పాత్రలో కొత్తదనం కనిపించింది. నూతన దర్శకుడు శరత్ మండవ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
రాక్షసత్వానికి ప్రతీక..
రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మంగళవారం ఆయన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన గురు అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. కథాపరంగా గురు పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని…రామ్, ఆది మధ్య వచ్చే సన్నివేశాలు హోరాహోరీగా సాగుతాయని దర్శకుడు తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నదని నిర్మాత చెప్పారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది.
సమ్మర్ సోగ్గాళ్ల కొత్త పోస్టర్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2కు సీక్వెల్గా దిల్ రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్, తమన్నా నాయికలు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.