జూబ్లీహిల్స్, నవంబర్ 30 : నల్గొండలో రెండు రోజులపాటు జరిగిన తెలంగాణ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో యూసుఫ్గూడ కేవీబీఆర్ క్రీడాకారులు సత్తా చాటారు. కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో కోచ్ క్యాతం శ్రీకాంత్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్న చిన్నారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఐదు బంగారు పతకాలు, నాలుగు వెండి, కాంస్యం పతకాలు దక్కించుకున్నారు. బాలికల విభాగం 38 కేజీల విభాగంలో పూజ, 58 కేజీల విభాగంలో హరిప్రియ, 62 కేజీల విభాగంలో కీర్తన యాదవ్, 68 కేజీల విభాగంలో జాన్హవి యాదవ్, బాలుర 65 కేజీల విభాగంలో లిఖిత్ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 46 కేజీల విభాగంలో లోచిత వెండి పతకం, 42 కేజీల విభాగంలో సాయి రోషిణి, 50 కేజీల విభాగంలో దేవిప్రియ, 82 కేజీల విభాగంలో శ్రీనివాస్ యాదవ్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.