అమరావతి : తెలంగాణకు చెందిన బొల్లి దివ్యవాణి అనే యువతి ఏపీలో ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఆమె సొంతింటిలోనే ఉరేసుకుంది.
సిరిసిల్లా జిల్లాకు చెందిన దివ్యవాణి(31) ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. మట్లపూడి బ్యాంక్ లో పనిచేస్తున్న సమయంలో బ్యాంకు నుంచి రూ. 40 లక్షలు అప్పు తీసుకుని గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించి, వేరొక వ్యక్తికి అద్దెకు ఇచ్చింది.
కొన్ని రోజులుగా బ్యాంక్లో పని ఒత్తిడి పెరిగిందని, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని ఇటీవల సొంతూరికి వచ్చిన ఆమె తల్లిదండ్రులకు వివరించింది. అక్కడి నుంచి గుళ్లపల్లికి వచ్చివిధులు నిర్వహిస్తుంది. అయితే శనివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అద్దెకు ఉంటున్న వ్యక్తి ఆదివారం ఉదయం గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశాడు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.