ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
కేంద్రం దిగొచ్చేదాకా ఉద్యమమే.. టీఆర్ఎస్ ప్రతిన
ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా..
ఊరూరా నిరసన జెండాలెత్తిన గులాబీశ్రేణులు
కేంద్రప్రభుత్వంపై మంత్రులు, నేతల ఆగ్రహం
ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా నిరసనల్లోకి రైతులు
మేముసైతం అంటూ పాలుపంచుకొన్న మహిళలు
ఎడ్లబండ్ల ర్యాలీలు.. పిడికిళ్లలో వరి కంకులు
వినూత్నరీతిలో కేంద్ర ప్రభుత్వంపై ధర్మాగ్రహం
పంజాబ్కు ఓ న్యాయం తెలంగాణకు ఓ న్యాయమా?
కొనేదాక కొట్లాటే
రైతులు ఎంతో కష్టపడి వరిని పండిస్తే ధాన్యాన్ని కొనకపోవడం సమంజసమా?
గ్రామ గ్రామాన పర్యటించి బీజేపీ బండారాన్ని బయటపెడతాం.
– వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
ధాన్యం కొనేదాకా పంజాబ్ తరహాలో ఉద్యమిస్తాం. రైతు వ్యతిరేక చట్టాలపై క్షమాపణలు చెప్పినట్టే.. తెలంగాణ రైతుల విషయంలోనూ అదే పునరావృతమవుతుంది.
– పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. ధాన్యం కొనుగోలు చేయడమనేది రాజ్యాంగం కల్పించిన విధి. మేమేం బిచ్చం అడుక్కోవడం లేదు.
– పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల
పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఆహార భద్రత చట్టం కూడా అదే చెప్తున్నది.
– విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
వరి ధాన్యాన్ని కొనేలా కేంద్రం మెడలు వంచుతాం. ప్రజలను నూకలు తినుమనడం కేంద్రమంత్రి అనాలోచిత విధానాలకు నిదర్శనం.
– విద్యాశాఖ మంత్రి, సబిత
‘ఒకే పన్ను..ఒకే దేశం’ పేరుతో జీఎస్టీని తీసుకొచ్చిన కేంద్రం.. ఒకే దేశంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నది?
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్, కిషన్రెడ్డి ఇప్పుడెక్కడున్నారు?
–రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల
కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం పాటిస్తున్నది. కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు.
-రవాణాశాఖ మంత్రి పువ్వాడ
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంపై తెలంగాణ మరోసారి మర్లవడింది. వడ్ల కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిపై నిప్పులు చెరిగింది. యాసంగి వడ్లు కొనాల్సిందేనని, అప్పటిదాకా విశ్రమించేది లేదని హెచ్చరించింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మంత్రుల నుంచి కార్యకర్తలదాకా.. గులాబీ సైన్యం తెలంగాణ రైతుకు దన్నుగా నిలిచి, దండులా కదిలింది. ‘రైతు మెడమీద బీజేపీ కత్తి.. ఇదేమి దేశభక్తి’ అని నినదించింది.
వడ్లు కొనని కేంద్ర వైఖరిని ఎండగట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలు, మున్సిపల్, నగర పాలక సంస్థల కార్యవర్గాలు సహా అన్ని స్థాయిల టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎక్కడికక్కడ రైతులు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో గొంతు కలిపారు. రోడ్లపై బైఠాయించారు.
మంత్రులు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలను, జిల్లా పార్టీ అధ్యక్షులను సమన్వయం చేస్తూ తమతమ నియోజకవర్గాల్లోని మండలాల్లో నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట, వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొని, కేంద్రం వైఖరిని ఎండగట్టారు. కరీంనగర్లో రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు. కేంద్రం ద్వంద్వ నీతిని తూర్పారబట్టారు. బాల్కొండ నియోజకర్గం వేల్పూరులో చేపట్టిన నిరసన దీక్షలో రాష్ర్ట రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కేంద్రం దిగిరాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ వరి గొలుసులు చేబూని శపథం చేశారు. రాష్ర్ట బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను నిరసన శిబిరంలో ప్రదర్శించారు.
మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రైతే మా మతమని తెగేసి చెప్పారు. రాజకీయం కోసం రైతాంగం నోట్లో మట్టి కొట్టొద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బండెనక బండి కట్టి.. అంటూ ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నల్లచట్టాలను కేంద్రం విరమించుకునేలా చేసిన రైతాంగ ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ రైతులతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతారని హెచ్చరించారు. వడ్లు కొనాల్సిందేనని తెలంగాణ కేంద్రానికి అల్టిమేటమ్ జారీ చేసింది. రైతుల కోసం ఎంతదూరమైనా వెళతామని టీఆర్ఎస్ మరోసారి కేంద్రానికి స్పష్టమైన సంకేతమిచ్చింది. న్యాయవాదులు, ప్రజాగాయకుడు గద్దర్, పౌరసమాజం.. రైతుల కోసం
టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.
సీఎంతో ఎంపీల భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేశ్రెడ్డి తదితరులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. పార్లమెంటులో మంగళవారం నాడు తాము చేపట్టిన నిరసన కార్యక్రమం గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలపై చర్చ జరిగింది.