జైనథ్, ఆగస్టు 24 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం జైనథ్ మండల కేంద్రంలో 89 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 48 మందికి ఆసరా పింఛన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలతో పాటు రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసిందన్నారు. ఇవ్వని హామీలు సైతం రాష్ట్రంలో అమలవుతుంటే మరో పక్క ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమచేస్తామన్న ప్రధాని మోదీ ఆ ఊసే మరిచారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఎరువులు, పనిముట్లపై సబ్సిడీని ఎత్తివేసి, నల్ల చట్టాలు తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఇల్లు లేని వారందరికీ 2021 నాటికి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్న ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినిపించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టనివ్వనని సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడం రైతులపై అభిమానాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వైస్ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్రెడ్డి, పురుషోత్తం యాదవ్, తాసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్రావు, సీడీపీవో వాణీశ్రీ, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి భూమి పూజ
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 24: పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం సాయిబాబా ఆలయానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని, సాయిబాబా ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు.