అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన శనివారం తెలంగాణకు స్వర్ణం సహా కాంస్య పతకం దక్కింది. స్టార్ షూటర్ ఇషాసింగ్ పసిడి వెలుగులు విరజిమ్మింది. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషాసింగ్ 26 పాయింట్లతో టాప్లో నిలిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఇదే విభాగంలో పోటీపడ్డ రితమ్ సాంగ్వాన్(25, హర్యానా), అబింద్యా అశోక్(19, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
క్వాలిఫయింగ్ పోటీల నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన 17 ఏండ్ల ఇషా రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా వెనుకకు తగ్గకుండా కీలక పాయింట్లు ఖాతా లో వేసుకుంది. ఈ క్రమం లో క్వాలిఫయింగ్ పోటీలు ముగిసేసరికి ఇషా 584 పాయింట్లతో స్టార్ షూటర్ మనుభాకర్(583) కంటే ముందంజలో నిలిచి అగ్రస్థానం దక్కించుకుంది.
స్వర్ణ పతక విజయంపై ఇషా స్సందిస్తూ ‘నేషనల్ గేమ్స్లో పతకం గెలువడం ప్రత్యేకమైన సందర్భం. పోటీల తొలి దశలో కొంత ఒత్తిడికి గురైనా మళ్లీ పుంజుకున్నాను. నాలుగో సిరీస్ నుంచి కచ్చితమైన షాట్లతో పాయింట్లు సాధించాను. నా ఏకైక లక్ష్యం పారిస్(2024) ఒలింపిక్స్కు అర్హత సాధించడమే. ఇప్పటి వరకు నా ప్రదర్శనపై సంతృప్తితో ఉన్నాను’ అని అంది. మరోవైపు రోలర్ స్కేటింగ్ అర్టిస్టిక్ కపుల్ డ్యాన్సింగ్లో అనుపోజు కాంతిశ్రీ, జుహిత్కు కాంస్య పతకం లభించింది.