హైదరాబాద్ : జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నదని స్పష్టం చేశారు. ప్రతీ రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నదని పేర్కొన్నారు.
నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థికశక్తిగా మన తెలంగాణ రూపొందిందని సీఎం తెలిపారు. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటలపాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
12.01 శాతం ఉత్పత్తిరంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. ఐటి రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ. తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ. 62 వేల కోట్లు ఉండగా, 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు పెంచుకోగలిగాం. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి మూడు రెట్లు పెరిగింది. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని సీఎం స్పష్టం చేశారు.
గత ఏడేండ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (ఎస్.ఓ.టి.ఆర్) లో 11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఆషామాషీగానో, అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతిరహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైందని తెలిపారు.
2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 48 వేల 115 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత ఏడేండ్లలో రాష్ట్ర జీఎస్డీపీ 127 శాతం పెరిగింది. అదే సమయంలో దేశ జీడీపీ 90 శాతం మాత్రమే పెరిగింది. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు.
తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటురాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. 2013-14 లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2 లక్షల 75 వేల రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1 లక్ష 50 వేల రూపాయలకంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఇది శుభపరిణామం అని కేసీఆర్ అన్నారు.
గత ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయం దాని అనుబంధ రంగాల పరిమాణం రెండున్నర రెట్లు పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అదే సమయంలో పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2. 2 రెట్లు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతంకన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైందని సీఎం స్పష్టం చేశారు.