హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా విద్యుత్తు సంఘాల నేతృత్వంలో దేశవ్యాప్త ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. కేంద్ర విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జేఏసీ) సమావేశంలో వారు మాట్లాడారు.
కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన ‘సేవ్ పవర్ సెక్టార్- సేవ్ ఇండియా’ పేరుతో నిరసనలకు నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయర్ అండ్ ఇంజినీర్ (ఎన్సీసీవోఈఈఈ) పిలుపునిచ్చిందని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలోని విద్యుత్తు ఉద్యోగులు అందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అదేరోజు నుంచి ‘స్టాప్ వర్క్’ చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్కు లేఖ రాశారు. దీని ప్రతినిధులు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావుకు అందించారు. సమావేశంలో జేఏసీ నాయకులు నరసింహులు, సదానందం, వేణుగోపాల్, వెంకట నారాయణరెడ్డి, నాగరాజు, కుమారస్వామి, ఈశ్వర్గౌడ్, నగేశ్, బస్వరాజు, శ్రీనివాస్, జనార్దన్రెడ్డి, తులసి నాగరాణి తదితరులు పాల్గొన్నారు.