సిరిసిల్ల/గంభీరావుపేట, అక్టోబర్ 21: సీఎం కేసీఆర్ ధార్మిక భావనతోనే తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లుతున్నదని శృంగేరి పీఠం వేదపండితులు వ్యాసోజుల గోపికృష్ణ అన్నారు. స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని ఆదరిస్తున్న గొప్పవ్యక్తి అని కీర్తించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గురువారం ఆయన తన స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటలో వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాసోజుల గోపికృష్ణ మాట్లాడుతూ.. గత పాలకులు వానల కోసం మేఘ మథనం చేశారని, కానీ ఆధ్యాత్మికత భావాలు కలిగిన రాజ్యపాలకుడైన కేసీఆర్ యాగాలతో అగ్నిమథనం చేసి అద్భుత ఫలితాలు సాధించారన్నారు. ఇప్పుడు ఉభయ గోదావరిలా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైందని వివరించారు. చండికా పరమేశ్వరీ ఉపాసనం చేసిన కేసీఆర్.. 200 ఏండ్లలో ఏ పాలకుడు చేయని విధంగా క్రతువులా అయుత చండీయాగాన్ని చేపట్టారని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.