నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం మంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజులతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టిన పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ ప్రాధాన్యతను చాటేలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ఆశించిన దానికంటే మరింత విస్తృత స్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించి వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
దేశానికి 1947 ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించగా.. తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17 న రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు. ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా, సెప్టెంబర్ 16 , 17 ,18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.