భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్ని దారుల్లో విద్యార్థులు, యువకులు, మహిళలు, సబ్బండ వర్ణాలు మువ్వన్నెల జెండా చేతబూని ఊరేగింపులు నిర్వహించారు. జై తెలంగాణ, జై భారత్ నినాదాలు నగరమంతా ప్రతిధ్వనించాయి. సమైక్యతా ర్యాలీలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు వాణీదేవి, శంభీపూర్ రాజు, ఎంఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొన్నారు.
కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వద్ద జరిగిన సమైక్యతా సభలో మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రసంగించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్రెడ్డి, వివేకానంద, మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, కృష్ణారావు, అరెకపూడి గాంధీ, బేతి సుభాష్రెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ తమ నియోజకవర్గాల్లో సమైక్యతా ర్యాలీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆధ్వర్యంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరూ త్రివర్ణ పతాకాలు చేతబూని చార్మినార్ నుంచి తీగలకుంట వరకు ఊరేగింపుగా వెళ్లారు.
బడంగ్పేట, సెప్టెంబర్ 16: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట చౌరస్తా నుంచి పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ వరకు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని చేతబూనిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ఐదు కిలోమీటర్లు నడిచారు. జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ కదం తొక్కారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేసి 18న తెలంగాణ కవులు, కళాకారులను సన్మానిస్తామని తెలిపారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు తీగల విక్రం రెడ్డి, ఇబ్రహీం శేఖర్, ఎంపీపీ రఘుమారెడ్డి, డీఈఓ సుసీందర్ రావు, ఎంఈవో కృష్ణయ్య, కమిషనర్లు కృష్ణమోహన్ రెడ్డి, సీహెచ్.నాగేశ్వర్ రావు, డీఈలు అశోక్ రెడ్డి, గోపీనాథ్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ అధ్యక్షుడు బేర బాలకృష్ణ, బడంగ్పేట్, మీర్పేట, తుక్కుగూడ మున్సిపల్ కార్పొరేషన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు నాయక్, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగేశ్, కందకూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యుగేందర్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వివిధ విభాగాల అధికారులు, నియోజక వర్గం, మండలాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జన సంద్రంగా బడంగ్పేట..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మీర్పేట నుంచి బడంగ్పేట వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువత, అధికారుల, ప్రజాప్రతినిధులు కదం తొక్కారు. ప్రతిఒక్కరూ త్రివర్ణ పతాకాలు చేతబూని వందేమాతరం.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. డీజే చప్పుళ్లు, నాయకుల తీన్మార్ స్టెప్పులు, విద్యార్థుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. అంతకు ముందుకు మీర్పేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి వజ్రోత్సవ ర్యాలీని ప్రారంభించారు.