కరోనా ఇబ్బందిపెట్టినా తగ్గని రాబడి
మార్చిలో రూ.1,501 కోట్ల ఆదాయం
ఈ ఏడాది లక్ష్యం రూ.15,600 కోట్లు
హైదరాబాద్, మార్చి 31 : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా ఇబ్బంది పెట్టినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం తెలంగాణ ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనంగా నిలుస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా రూ.12,500 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, గురువారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరం రూ.12,364 కోట్లు వచ్చింది. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో రూ.1,501 కోట్ల ఆదాయం రావడం విశేషం. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కలిపి ఏడాది కాలంలో 19.80 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్టు సమాచారం.
ఎనిమిదేండ్లలో 468 శాతం వృద్ధి
2020-21లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,260 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈసారి 136 శాతం అధికంగా రాబడి నమోదైంది. తెలంగాణ చరిత్రలో మొదటిసారి రూ.12 వేల కోట్ల మార్కును అధిగమించింది. గత ఎనిమిదేండ్లలో రిజిస్ట్రేషన్ల రాబడి 468 శాతం పెరగడం విశేషం. 2014-15లో ఈ శాఖ రాబడి రూ.2,175 కోట్లు మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ ఆదాయం స్థిరంగా పెరుగుతున్నది. 2014-15లో 9 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, 2021-22 నాటికి సుమారు 20 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం.
కొత్త ఏడాదిలో మరింత జోరుగా..
శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ‘రియల్’ నిపుణులు సైతం ఇదే చెప్తున్నారు. కరోనా నిబంధనలు సడలించటం, ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎత్తివేయడం కలిసి వస్తుందని అంటున్నారు. రెండేండ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న వ్యాపార, వాణిజ్య రంగాలు గోడకు కొట్టిన బంతిలా రెట్టించిన వేగంతో దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండ్లతోపాటు వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతుందని, ఇది రియల్ ఎస్టేట్ ఎగుదలకు తోడ్పడుతుందని విశ్లేషిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,600 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది.