నిజామాబాద్ : వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని ఆయన తెలిపారు. వేల్పూరు, మోర్తాడ్, బాల్కొండ మండల కేంద్రాల్లో మంగళవారం మంత్రి వేముల లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 52 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతుండగా, కొత్తగా 10 వేల మందికి పెన్షన్ల జాబితాలో చోటు కల్పించారన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.
వయసు పైబడిన వారు చివరి దశలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు తెలంగాణలో పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి నమూనాగా గొప్పలు చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో 20 రెట్లు అధికంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి గణాంకాలతో సహా వివరించారు.
ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పాలనకు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ ఆర్దీవో శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్, డీ ఎల్ పీ ఓ శ్రీనివాస్, మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్, ఎం.ఏ.అజీస్,అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.