హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బ్రాండ్ల బీర్లపై ఒక్కో బాటిల్పై రూ.10 చొప్పున, దేశీయ మద్యంపై క్వార్టర్పై రూ.20, విదేశీ బ్రాండ్ల మద్యం రకాలకు క్వార్టర్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశాలిచ్చారు. పెంచిన ధరలను గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆబ్కారీశాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. 2020 మేలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, రెండేండ్ల తర్వాత మళ్లీ ధరలను సవరించింది. మద్యం వినియోగం తగ్గించేందుకు ధరల పెంపు ఉపయోగపడుతుందని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
క్వార్టర్పై రూ.20 నుంచి రూ.40 పెంపు
సైజులు, బ్రాండ్లతో సంబంధం లేకుండా అన్ని రకాల బీర్లపై బాటిల్కు రూ.10 చొప్పున పెరిగింది. అన్ని రకాల వైన్లపై క్వార్టర్కు రూ.10 చొప్పున, 375 ఎంఎల్కు రూ.20, 750 ఎంఎల్కు రూ.40 చొప్పున ధరలు పెంచారు. దేశీయ లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్కు రూ.200లోపు ధర ఉన్నవాటికి క్వార్టర్కు (180 ఎంఎల్)కు రూ.20 చొప్పున ధరల పెరిగాయి. 375 ఎంఎల్కు రూ.40, 750 ఎంఎల్ (ఫుల్ బాటిల్)కు రూ.80 చొప్పున ధర పెరిగింది. క్వార్టర్కు రూ.200పైన ధర ఉన్న బ్రాండ్లపై రూ.40 చొప్పున ధర పెరిగింది. 375 ఎంఎల్, 750 ఎంఎల్పై వరుసగా రూ.80, రూ.160 చొప్పున ధరలు పెంచారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే 1800425252 3 నంబర్లో ఫిర్యాదు చేయాలని సర్ఫరాజ్ సూచించారు. బ్రాండ్లు, సైజులవారీగా పెరిగి మద్యం ధరల కోసం https://www.tsbcl.telangana. gov.in/ts/ లో చూడాలని సూచించారు.