హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలతో జగన్ 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసుల్లో తన తరఫున తన న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థనను గతంలో సీబీఐ కోర్టు తిరస్కరించడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన 11 పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం 33 పేజీల తీర్పును వెలువరించారు. జగన్ తరఫున ఆయన న్యాయవాది సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించారు. నిందితుడిపై అభియోగాలు ఉన్నంత మాత్రాన నేరం చేసినట్టు చెప్పలేమని అన్నారు. సీబీఐ కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తప్పు చేసిందని, జగన్ అభ్యర్థనను తోసిపుచ్చడం చెల్లదని స్పష్టం చేశారు.