హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభలో పోడియం వద్దకు దూసుకెళ్లి అడ్డగోలుగా వ్యవహరించిన బీజేపీ ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ను సభ నుంచి సస్పెండ్ చేయడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చింది. ఈ సస్పెన్షన్పై స్టే విధించేందుకు నిరాకరించింది. వారిని ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా సస్పెండ్ చేశారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సస్పెన్షన్ను సవాలు చేస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా దాఖలు చేసిన ప్రధాన రిట్ పిటిషన్పై విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం ప్రకటించారు. అసెంబ్లీ వీడియో ఫుటేజీతోపాటు తమను సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆమోదించిన తీర్మాన ప్రతిని, శాసనసభ ప్రొసీడింగ్స్ కాపీని ఇప్పించాలని పిటిషనర్లు చేసిన వినతిని హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన విషయం విదితమే. కనీసం వాటిని హైకోర్టుకైనా సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది చేసిన విన్నపాన్ని కూడా హైకోర్టు తిరసరించింది.
బీజేపీ ఎమ్మెల్యేల మధ్యంతర పిటిషన్ను ఆమోదించేందుకు, వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీచేసేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అధికారపక్ష సభ్యులు స్పీకర్తో కుమ్మకు అవ్వడం వల్లే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టు భావించలేమని తెలిపింది. సస్పెండ్ చేసే సభ్యుల పేర్లను స్పీకర్ మాత్రమే చదవాలని, మంత్రి చదవకూడదని పిటిషనర్లు వాదించడం సరికాదని పేర్కొన్నది. శాసనసభా కార్యక్రమాలకు అవాంతరాలు కలిగిస్తున్నవారిని సస్పెండ్ చేయడంపై స్పీకర్ తనకు తానుగా నిర్ణయం తీసుకోవచ్చని లేదా వారి సస్పెన్షన్కు సభలో ఎవరైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని తేల్చిచెప్పింది. దీనిని స్పీకర్, సభ ఆమోదిస్తే సస్పెన్షన్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి తలసాని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించి ఓటింగ్ నిర్వహించాకే సభ ఆమోదించిందని గుర్తుచేసింది. ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసిన అశీష్ షెలార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇకడ బీజేపీ ఎమ్మెల్యేల కేసులో వర్తించదని, రాజ్యాంగపరమైన ఈ అంశాలను పరిశీలిస్తే.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ చట్ట ప్రకారమే జరిగినట్టు స్పష్టమవుతున్నదని తేల్చిచెప్పింది. పిటిషనర్లు ఒక టీవీ చానల్ నుంచి తీసుకొన్న వీడియోను అందజేశారని, దాన్ని పరిశీలించి తుది నిర్ణయానికి రాలేమని, విచక్షణాధికారాల పేరుతో పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేయలేమని స్పష్టం చేసింది. అందుకే మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రధాన పిటిషన్పై లోతుగా విచారణ చేయాల్సి ఉన్నందున్న శాసనసభ కార్యదర్శితోపాటు శాసనసభ సచివాలయ కార్యదర్శికి మరోసారి నోటీసులు జారీచేస్తున్నామని, తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నామని ప్రకటించింది.