సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో వెల్లువలా పరిశ్రమలు
టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు వంద గజాల ప్లాట్లు
స్క్రిప్టులు చదవడం కాదు.. అన్నదాతలకు ఏం చేశారో చెప్పాలి
టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, మే 7 : అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైనమిక్ లీడర్, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక రంగలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు వచ్చిందని గుర్తు చేశారు. ఈ ప్రాంత రైతులు, ప్రజల సహకారంతో వస్త్ర నగరి కల సాకారమైందని, భూములు ఇచ్చిన వారికి ప్రతి ఎకరాకు వంద గజాల లేవుట్ ప్లాట్ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఇప్పటికే ఒక పరిశ్రమ ప్రారంభమైందని, సంవత్సరంలోగా మరో రెండు కంపెనీలు ప్రారంభమవుతాయన్నారు.
కరోనా కారణంగా కంపెనీల రాక ఆలస్యమైందని, కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతమంతా పరిశ్రమల కారిడార్గా మారబోతున్నదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. స్క్రిప్టులు చదవడం కాదు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కరంటు, నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. పరకాల నియోజకవర్గంలో మరో 5 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని ఆయన మంత్రి కేటీఆర్ను కోరారు. అలాగే, నియోజకవర్గంలో 32 గిరిజన గ్రామాలు, 18 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ దళిత బంధు ఇవ్వాలన్నారు. ఇందుకు గాను మరో రూ.8కోట్ల నిధులను కేటాయించాలన్నారు. చేనేత వలస కార్మికులు టెక్స్టైల్ పార్కుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి అప్లికేషన్ పెట్టుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు.