హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వపై అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని తన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది. విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ చర్యలతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. ఏపీ చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులను కూడా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.