అగ్గిపెట్టెలో ఇమిడే చీర నుంచి ఖండాంతర ఖ్యాతిగాంచిన ‘ గొల్లబామ చీర’ను నేసిన తెలంగాణ చేనేతల కళానైపుణ్యం మాటల్లో చెప్పలేనిది. సమైక్య రాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వ ఆదరణ లేక నేతన్నలు నాడు ఉపాధి కరువై ఆకలిచావుల పాలయ్యారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో నేత కార్మికులు పొట్టకూటి కోసం వలసబాట పట్టారు. టీఆర్ఎస్ సర్కారు వారి అభివృద్ధికి కృషిచేస్తున్నది.రూ.100 కోట్లతో నూలు సబ్సిడీ పథకం అమలు చేస్తున్నది. 50 ఏండ్ల నేతన్నలకు చేనేత పింఛన్ ఇస్తున్నది. సబ్సిడీలు ఇచ్చి అండగా నిలుస్తున్నది. కాగా, ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచి నేతన్నలకు రూ. 5 లక్షల బీమా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో చేనేత కుటుంబాలకు ధీమా ఏర్పడనున్నది.
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బీమా పథకంలో లబ్ధిదారుడు మరణించిన పది రోజుల్లో నామినీ బ్యాంకు ఖాతాలో బీమా పరిహారం డబ్బులు రూ.5 లక్షలు జమకానున్నాయి. దీంతో చేనేత కుటుంబాలకు ధీమా ఏర్పడనుంది.
దుబ్బాక, ఆగస్టు 02 : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల కారణంగా ఆదరణ కరువై కుదేలైన చేనేత పరిశ్రమకు టీఆర్ఎస్ సర్కారు జీవం పోసింది. నాడు నేతన్నలకు ఉపాధి కరువై, అప్పుల బాధతో ఆత్మహత్యలు, ఆకలిచావుల పాలయ్యారు. మరికొందరు పొట్టకూటి కోసం వలసబాట పట్టారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర నుంచి ఖండాంతర ఖ్యాతిగాంచిన ‘ గొల్లబామ చీర’ను నేసిన తెలంగాణ చేనేతల కళానైపుణ్యం మాటల్లో చెప్పలేనిది. అలాంటి చేనేత రంగానికి పూర్వవైభవం కల్పించేందుకు టీఆర్ఎస్ సర్కారు విశేషంగా కృషిచేస్తున్నది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. నేతన్నలకు చేతినిండా పని కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. చేనేత కార్మికులకు ఉపాధితో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లు బడ్జ్జెట్లో కేటాయించింది. చేనేత, జౌళి రంగానికి చర్రితలో ఎన్నడూ లేనంతగా, ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. బలహీన వర్గాల సంక్షేమం కోసం స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ. 400 కోట్లు అదనంగా కేటాయించింది. తాజాగా చేనేత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. రైతుబీమా మాదిరిగా నేతన్నలకు చేనేత బీమా అమలు కానున్నది. చేనేత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వ్యవసాయం తర్వాత చేనేత వృత్తిపైనే ఎక్కువ మంది బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో చేనేత సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు విశేషంగా కృషిచేస్తున్నది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.50 కోట్లు వెచ్చించింది. నేతన్నలకు బీమా కల్పించేందుకు ఎల్ఐసీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదిరించుకుంది. నేతన్నలు బీమా కోసం రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నది. సిద్దిపేట జిల్లాలో చేనేత బీమా పథకం ద్వారా 2200 మంది నేతన్నలకు ప్రయోజనం చేకూరనుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మరో 400మంది చేనేత కార్మికులకు లబ్ధి జరుగనున్నది. 60 ఏండ్లలోపు చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ కార్మికులకు చేనేత బీమా వర్తించనుంది. సిద్దిపేట జిల్లాలో చేనేత, మరమగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న వారిలో 60 ఏండ్లలోపు వారు 2 వేలకు పైగా ఉన్నారు.
రూ.100 కోట్లతో నూలు సబ్సిడీ పథకం..
తెలంగాణలో చేనేత అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఇప్పటికే చేనేత కార్మికులకు 50 ఏండ్లకే ఆసరా పింఛన్ ఇస్తున్నది. దీంతో పాటు ‘చేయూత’ పథకం ద్వారా చేనేతలకు పొదుపు చేసుకునే అవకాశం కల్పించింది. చేనేతలు 10 శాతం జమచేస్తే మరో 20 శాతం ప్రభు త్వం జమచేస్తున్నది. తెలంగాణలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు అరికట్టేందుకు, చేనేత కార్మికులకు మరింతగా ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించి గత బడ్జ్జెట్లో రూ.1,270 కోట్లు కేటాయించారు. చేనేత అభివృద్ధి కోసం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ రూ.100కోట్లతో ‘నూలు సబ్సిడీ’ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంతో రాష్ట్రంలో చేనేత కార్మికులకు నూలు, ముడి సరుకులపై 40శాతం సబ్సిడీ ఇస్తుండడంతో లబ్ధి పొందుతున్నారు.
సబ్సిడీలతో సర్కారు ప్రోత్సాహం..
చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టిన ‘నూలు సబ్సిడీ’ చేనేత మిత్ర పథకాల ద్వారా చేనేత కార్మికులతో పాటు చేనేత సహకార సంఘాలకు ప్రయోజనం చేకూరుతున్నది. ఇప్పటి వరకు తెలంగాణలో చేనేత సహకార సంఘాల వారు తెలంగాణ స్టేట్ కో ఆపరేటీవ్ సొసైటీ(టెస్కో) ద్వారా నూలు కొనుగోలు చేసేవారు. వీటితో పాటు ప్రైవేట్ యారన్ డిపోల్లో సైతం నూలు, ముడి సరుకులు కొనుగోలు చేసేవారు. గతంలో క్లస్టర్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి 10 శాతం నూలుపైనే సబ్సిడీ వచ్చేది. జిల్లాలో ఐదేండ్ల కిందట సిద్దిపేట, దుబ్బాక క్లస్టర్లలో ఏర్పాటు చేసిన యారన్ డిపోల్లో నూలుపైన 10శాతం సబ్సిడీ అందించారు. ప్రస్తుతం జిల్లాలో క్లస్టర్లు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నూలు సబ్సిడీ అందుకోలేక పోయారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించే 40శాతం సబ్సిడీ నేతన్నలకు జమ అవుతున్నది. ఇందులో నుంచే చేనేత సహకార సంఘాలకు 5శాతం జమవుతున్నది. దీంతో పాటు రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 3 వేల మంది చేనేత కార్మికుల వ్యక్తిగత రుణం మాఫీ అయ్యింది.
రుణపడి ఉంటాం..
చేనేత బీమాను ప్రవేశ పెట్టడం వరంగా భావిస్తున్నాం. సీఎం కేసీఆర్ సార్కు రుణంలో ఉంటం. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక మాకు మేలు జరిగింది. మా కుటుంబాల్లో వెలుగులు నిండాయి. చేనేత బీమా, నూలు సబ్సిడీ, రుణమాఫీ పథకాలు మాకు ప్రయోజనకరంగా మారాయి. రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న సర్కారు చేనేత కార్మికులమంతా రుణపడి ఉంటాం.
– వీరబత్తిని బాలరాజు, చేనేత కార్మికుడు, దుబ్బాక
మా కుటుంబాలకు భరోసా..
టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేతలకు ప్రయోజనం చేకూరింది. 50 ఏండ్ల నేతన్నలకు చేనేత పింఛన్ ఇస్తున్నది ప్రభుత్వం. ఇప్పుడు 60 ఏండ్లలోపు వారికి చేనేత బీమా కల్పించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని మాకు చేనేత బీమా పథకం ధీమానిస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జిందం రాజేశం, చేనేత కార్మికుడు, దుబ్బాక