నిరంతరాయంగా సరఫరా
విద్యుత్ వ్యవస్థ బలోపేతమే దోహదం
ఇప్పటికే అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు
వర్షాలతో దెబ్బతిన్న లైన్లను వెంటనే పునరుద్ధరణ
వ్యాపారులు, వాణిజ్య అవసరాలకూ సరిపడా సరఫరా
రెడ్ అలర్ట్లోనూ ఊపిరి పీల్చుకుంటున్న జనం
ఇంట్లోనే టీవీల ముందు కాలక్షేపం
సజావుగా వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీలు
వానల్లోనూ ఉమ్మడి జిల్లాలో నిత్యం 16 మిలియన్ యూనిట్ల వినియోగం
24 గంటలు అందుబాటులో సిబ్బంది
సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందంటున్న ప్రజానీకం
ఒకప్పుడు గాలి దుమారం రేగినా, చినుకుపడినా కరంటు పోయేది. ఊరంతా అంధకారమయ్యేది. ఓల్టేజీతో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయేవి. కర్మ చాలక ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందా! ఇంట్లో లైటు బుగ్గ వెలిగేందుకు ఎంతక్కువ వారం పట్టేది. కూలిన స్తంభాలు, తెగిన తీగలు గంటలు, రోజుల తరబడి భయపెట్టేవి. ఆ చీకటి రోజులను చీల్చుకుంటూ వచ్చిన విద్యుత్ ప్రభ పగలూరాత్రి, ఎండావాన తేడా తెలియనివ్వకుండా ఉపశమనం కలిగిస్తున్నది.
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నవాళ్లు టెన్షన్ లేకుండా డ్యూటీ చేసుకుంటున్నారు. ఇల్లే ఆసరాగా పొట్ట పోసుకుంటున్న చిరుజీవులు, మరమగ్గాలతో ఉపాధి పొందే చేనేత కార్మికులు అన్ని రోజుల్లాగే పని చేసుకుపోతున్నారు. ఇన్వర్టర్లన్నీ ఉపయోగం లేకుండా మూలకు పడ్డాయి. నిరంతర నాణ్యమైన విద్యుత్తో తెలంగాణ సర్కారు సాధించిన విప్లవాత్మక మార్పు ఇది. నేడు ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట కూడా ఇదే!!
నడి వేసవిలోనూ, ఇప్పుడు భారీ వర్షాల్లోనూ అంతరాయం లేని కరంటు సరఫరా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సాధ్యమైంది. విద్యుత్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తతో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటున్నది. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లో వారి సేవలు అభినందనీయం. వర్షాలతో ఎక్కడైనా స్థానికంగా కరంటు స్తంభాలు, లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించాం. ఎట్టిపరిస్థితిల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ఆస్కారం ఉండదు. ప్రజలు కూడా వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలి.
-గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
24 గంటల నాణ్యమైన విద్యుత్తో కేసీఆర్ ప్రభుత్వం సమూల మూర్పులకు శ్రీకారం చుట్టింది. లో ఓల్టేజీ సమస్యకు చెక్ పెడుతూ అవసరమైన చోటల్లా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో విద్యుత్ స్తంభాలు, లైన్ల పునరుద్ధరణతో విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టమైంది. భారీ వర్షాలకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడినా జూనియర్ లైన్మన్ నుంచి జిల్లా అధికారుల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సమస్యను పరిష్కస్తున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నారు. ఇంత వానల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల అవసరాల కోసం నిత్యం సగటున 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.సమైక్య రాష్ట్రంలో కరంటు కోసం తీవ్ర ఇబ్బందులుపడ్డ ఉమ్మడి నల్లగొండ ప్రజలు నేడు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సారథ్యంలో విద్యుత్ వెలుగులను పొందుతుండడం విశేషం.
నల్లగొండ ప్రతినిధి, జూలై14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సరఫరా అనేది అతి పెద్ద సమస్యగా ఉండేది. నాడు ఉన్న వనరులను వాడుకోలేని దుస్థితిలో కరెంట్ ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరాపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో వ్యవసాయానికి 9గంటలకు మించి గృహాలు, ఇతర వినియోగానికి 12 నుంచి 15 గంటలకు మించి కరెంట్ సరఫరా ఉండేది కాదు. పైగా ఇచ్చే కరెంట్లోనే వేసవిలో లోఓల్టేజీ, వర్షాల్లో హైఓల్టేజీలతో చాలా ఇబ్బందులు ఉండేవి. క్రమపద్ధతిలో వ్యవసాయ బావులకు సరఫరా జరిగేది కాదు. దీంతో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. ఇండ్లల్లోనూ వస్తువుల రిపేర్లు సర్వసాధారణంగా జరిగేది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ స్వరాష్ట్రంలోనే అత్యధిక బోరుబావులున్న జిల్లాగా ప్రసిద్ధి చెందింది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా జిల్లాలోనే ఉండేది. వేసవి వస్తే వ్యవసాయ, గృహాల విద్యుత్ వినియోగాన్ని సమన్వయం చేయడానికి అధికారులు నానా తంటాలు పడేవారు.
కొన్నిసార్లు ఇండ్లకు కోతలను పెంచి వ్యవసాయానికి ఇచ్చే ప్రయత్నాలు జరిగేవి. ఈ క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇక వర్షాకాలంలో సైతం గాలిదుమారాలు, భారీ వర్షాలతో కరెంటు పోల్స్ కూలిపోయేవి. లైన్లు ధ్వంసమై ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినేవి. కరెంట్ సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరిగేది. నేడు ఆ పరిస్థితులు మచ్చుకు కూడా కానరావడం లేదు. వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా కరెంట్ సరఫరాలో అంతరాయాలు కనిపించలేదు. ఒక వేళ అక్కడక్కడా పోల్స్ విరుగడం, లైన్లు తెగడం జరిగితే వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటుతోపాటు గృహాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు సైతం నిరంతరం సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
మిర్యాలగూడ అశోక్నగర్లో మంగళవారం రాత్రి 9.20గంటలకు విద్యుత్ స్తంభంపై ఇన్సులేటర్ ఫెయిల్ అవడంతో కొత్తది అమర్చి సమస్యను పరిష్కరించిన విద్యుత్ సిబ్బంది
సూర్యాపేటలో వానలకు ఇంట్లోనే ఉండి టీవీ చూస్తున్న కుటుంబం
మేళ్లచెర్వులో నూతన విద్యుత్ స్తంభాన్ని అమర్చుతున్న సిబ్బంది
10.33 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు
స్వరాష్ట్రంలో ఇటు గృహ, అటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.33 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు, 4.68లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి వాణిజ్య, పరిశ్రమలు, స్ట్రీట్లైట్స్, మంచినీటి బోర్ల కనెక్షన్లు అదనం. ఒక్క నల్లగొండ జిల్లాలో 2014లో గృహ విద్యుత్ కనెక్షన్లు 2.09లక్షలు ఉంటే ప్రస్తుతం4.63లక్షలకు చేరుకున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు 1.40లక్షలు ఉంటే ప్రస్తుతం 2.15లక్షల కనెక్షన్లకు పెరిగాయి. కనెక్షన్లు దాదాపు రెట్టింపు అయినా ఎక్కడా కరెంట్ సరఫరాలో ఇబ్బందులు లేవు. కనెక్షన్లకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి పై వరకు కరెంట్ సరఫరా వ్యవస్థను పటిష్టపరుస్తూ వచ్చారు. సబ్స్టేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు కొత్త హెచ్టీ, ఎల్టీ లైన్లను విస్తరించారు. ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచి కొత్తగా కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. లూజ్ వైర్లను సరిచేశారు. నల్లగొండ జిల్లాలో వర్షాలకు 84 పోల్స్ దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే వాటిని రిప్లేస్ చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చేశారు. వర్షాల నేపథ్యంలో మంత్రి జగదీశ్రెడ్డి విద్యుత్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఎక్కడైనా ప్రకృతి విపత్తుతో ఇబ్బందులు వస్తే వెంటనే చర్యలకు ఆదేశిస్తున్నారు. విద్యుత్తు అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ చర్యలు చేపడుతున్నారు. వీటన్నింటి ఫలితంగానే భారీ వర్షాల సమయంలోనూ కరెంట్ సరఫరాలో ఇబ్బందులు లేవన్న చర్చ ప్రజల్లో సాగుతున్నది. సోషల్మీడియాలో సైతం ఇంతటి వర్షాల్లోనూ కరెంట్ పోకపోవడం కేసీఆర్తోనే సాధ్యమైందన్న పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
నిత్యం 16 మిలియన్ యూనిట్ల వాడకం
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగటున 16 మిలియన్ యూనిట్ల వాడకం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక వేసవిలో అయితే 22 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరిగినా డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ చేయడంలో విజయవంతమయ్యారు. ఎక్కడా ఆటంకాలు లేకుండా ఈ వర్షాల్లోనూ నిత్యం కరెంటు సరఫరా జరిగింది. స్థానికంగా వచ్చే చిన్నచిన్న ఆటంకాలు మినహా పై నుంచి కరెంటు సరఫరా నిలివేయడం అనేది లేకుండా పోయింది.
నల్లగొండ జిల్లా..
నల్లగొండ జిల్లాలో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ లైన్ల విస్తరణ భారీగా చేపట్టారు. 2014లో 132/33 కేవీ సబ్ స్టేషన్లు 8 ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్యను రూ.75కోట్లు వెచ్చించి 13కు పెంచారు. 33/11కేవీ సబ్స్టేషన్లు 2014లో 123 ఉంటే ఏండేండ్లలో రూ.85.93కోట్లు వెచ్చించి 168కి పెంచారు. నల్లగొండ సర్కిల్లో విద్యుత్ లైన్ల విస్తరణను పరిశీలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. 33కేవీ ఓహెచ్ లైన్ అప్పట్లో 900 కిలోమీటర్ల మేర ఉంటే దాన్ని ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో 1825 కిలోమీటర్లకు విస్తరించారు. ఇందుకోసం అదనంగా రూ.74 కోట్లను వెచ్చించారు. 11కేవీ ఓహెచ్ లైన్ను 6,526 కిలోమీటర్ల నుంచి రూ.520కోట్లను వెచ్చించి 14013 కిలోమీటర్లకు విస్తరించారు. ఎల్టీ లైన్లను 23,046 కిలోమీటర్ల నుంచి 32,415కిలోమీటర్లకు రూ.232 కోట్లను వెచ్చించి విస్తరించారు. ఇక క్షేత్రస్థాయిలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్లు 2014 జూన్ 2 నాటికి 36,447 ఉంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.183.96కోట్లు ఖర్చు చేసి 69,787కు పెంచారు.
వెల్డింగ్ పనులకు ఇబ్బంది లేదు
గతంలో వెల్డింగ్ పని చేయాలంటే మాటిమాటికి కరెంట్ పోయేది. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలువకపోయేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కరెంట్ కష్టాలు తీరినయి. రైతులు ట్రాక్టర్, నాగళ్లు, దమ్ము చక్రాలకు సంబంధించిన పనులకు వస్తున్నరు. ప్రస్తుతం వానలు పడుతున్నా కరెంట్ పోతలేదు. మా దగ్గరికి వచ్చిన రైతులకు ఇబ్బంది లేకుండా పనవుతున్నది.
-మన్సూర్ అలీ, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు, గరిడేపల్లి
వానొచ్చినా కరెంట్ పోతలేదు
ఎన్ని వర్షాలు వచ్చినా ఇప్పుడు కరెంట్ పోతలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినంక కరెంట్ బాధలు పోయినయి. నేను కారం మిషన్ నడుపుతా. గతంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఎప్పుడొస్తుందో తెలువకపోయేది. వానకాలంల గూడా పోయేది. ఇప్పుడు పోవుడన్న ముచ్చట లేదు. కరెంట్తో మా కారం మిషన్ మంచిగానే నడుస్తున్నది.
–వ్యడ్త అంబాలి, కొండమల్లేపల్లి, కారం మిషన్ యజమాని
పడిగాపులు తప్పినయ్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరెంట్ కష్టాలు తీరినాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సరిపోను లేక రైతులు అరిగోస పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ఇప్పుడు 24 గంటలు విద్యుత్ వస్తున్నది. ఒకప్పుడు పొలాల దగ్గర పడిగాపులు కాసిన రైతులకు ఇబ్బందులు తప్పినయి. ఇప్పుడు వర్షంలో కరెంట్ సమస్య లేదు.
– యలగొండ నాగేశ్వర్రావు, రైతు, నడిగూడెం
చేనేత కార్మికులకు ఇబ్బంది లేదు
మరమగ్గాలు నడువాలంటే కరెంట్తోనే పని. గతంలో కరెంట్పోతే ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. తెలంగాణ వచ్చినంక విద్యుత్ సమస్యలు లేవు. కరెంట్ పుష్కలంగా ఉండడంతో చేతినిండా పని దొరుకుతున్నది.
– పొట్టబత్తుల సత్యనారాయణ, చేనేత కార్మికుడు, తిప్పర్తి
కరెంట్ కోతల్లేవు
గత ప్రభుత్వంలో కరెంట్ కోతలతో వ్యాపారులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడాపరిస్థితి లేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ కరెంట్ పోవడం లేదు. ఒకవేళ పోయినా వెంటనే వస్తున్నది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడంతో ఏ సమస్యా ఉండడం లేదు.
– నీలా విష్ణుమూర్తి, వ్యాపారి, తిరుమలగిరి సాగర్
24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం
తిరుమలగిరి మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉండగా కరెంట్ కోతల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షంలో కరెంట్ వైర్లు గాలికి తెగినా వెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా 24 గంటలు సరఫరా చేయిస్తున్నాం.
– ఎ.బాలు, ట్రాన్స్కో ఏఈ, తిరుమలగిరి సాగర్
గతంలో ఫోన్ ఎత్తాలంటే భయంగా ఉండేది
నేను జూనియర్ లైన్మెన్గా 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఎండాకాలం, వానకాలంలో ఫోన్లు వస్తే ఎత్తేందుకు భయపడేవాళ్లం. కరెంట్ పోతే రైతులు, సామాన్య ప్రజలకు సమాధానాలు చెప్పలేకపోయేవాళ్లం. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసిన సందర్భాలు ఎన్నో. ప్రస్తుతం నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించడంతో మేము హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నాం. రాష్ట్రంలో అతి పటిష్టమైన విద్యుత్ సంస్థ ఉంది అనడంలో సందేహం లేదు.
– జెట్టి నాగిరెడ్డి, ఏఎల్ఎం, కోదాడ
వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నాం
వానలు జోరుగా పడుతున్నా ప్రజలకు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా ఫోన్ సమాచారం అందించిన వెంటనే పరిష్కరిస్తున్నాం. మండలంలో పది విద్యుత్ స్తంభాలు వానలకు కూలిపోయి వైర్లు తెగాయి. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాం. వ్యవసాయానికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – లావూరి శ్రీను, ఏఈ, దామరచర్ల
పల్లె ప్రగతిలో సమస్యలు లేకుండా చేశారు..
వారం రోజులుగా వర్షం కురుస్తున్నా కరెంట్ సరఫరాలో అంతరాయం లేదు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమంలో పాత విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. విద్యత్ తీగలపై వాలిన కొమ్మలను ఎప్పటికప్పుడు కొట్టివేయడంతో సరఫరాలో ఇబ్బంది లేదు. 24 గంటల విద్యుత్తో మిల్లులు, స్వయం ఉపాధి యంత్రాలు నిరంతరంగా నడుస్తున్నాయి.
– మద్ది ధన్వంతరెడ్డి, చనుపల్లి, అనంతగిరి మండలం