బాల కార్మిక వ్యవస్థకు చరమగీతం
ఆపరేషన్ ముస్కాన్తో పిల్లల గుర్తింపునకు
సంగారెడ్డి జిల్లాలో ఐదు బృందాలు
ఇప్పటి వరకు 424 మంది చిన్నారులకు విముక్తి
పాఠశాలలో చేరిన 312 మంది
తల్లిదండ్రులకు 112 మంది అప్పగింత
ఈ నెల 31 వరకు గుర్తింపు కార్యక్రమం
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
పాఠాలు చదవాల్సిన ‘రేపటి తరం’ పనుల్లో కనిపించొద్దని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. భవిష్యత్ బాలలదేనని, పిల్లలంతా బడుల్లోనే కనిపించాలని ‘ఆపరేషన్ ముస్కాన్’, ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, పిల్లలను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నది. ఇందులో భాగంగా బాలల పరిరక్షణ అధికారులు, పోలీసు శాఖ, కార్మిక, వైద్యారోగ్య శాఖల సమష్టి సహకారంతో ముందుకెళ్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు వివిధ పనుల్లో ఉన్న 424 మంది పిల్లలకు అధికారులు విముక్తి కలిగించారు. దీంతో ఆ చిన్నారుల బంగారు భవిష్యత్కు బాటలు పరుచుకున్నాయి.
సంగారెడ్డి, జూలై 15: సమాజంలో బాల కార్మికులుగా ఇండ్లల్లో వెట్టిచాకిరి, భిక్షాటన చేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ ముస్కాన్-8 కార్యక్రమం ప్రారంభించారు. ఈ నెల 4న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రమణ కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. చిన్నారులను పనికి పెట్టుకున్న యాజమాన్యాల నుంచి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా చదువుపై ఆసక్తి ఉన్న పిల్లలకు చదువు నేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనాథ బాలలను గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించి వసతులను ఏర్పాటు చేసి పిల్లల ఇష్టాన్ని బట్టి వారికి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకోసం జూలై 1 నుంచి 31 వరకు జిల్లాలో నెల రోజులపాటు ఆపరేషన్ను ముస్కాన్ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. 2019 నుంచి ఇప్పటి వరకు 424 మంది బాలలను రక్షించి ప్రభుత్వ పాఠశాలల్లో 312 మంది, తల్లిదండ్రులకు 112 మంది చిన్నారులను అప్పగించారు.
గతేడాది 138 మంది చిన్నారులకు విముక్తి…
గత ఏడాది జనవరిలో ప్రారంభించిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో జిల్లాలో 138 మంది చిన్నారులకు అధికారులు విముక్తి కలిగించారు. గుర్తించిన అందరినీ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బాల కార్మికులను ప్రోత్సహిస్తూ తక్కువ కూలీకి వస్తారనే అపోహతో పనుల్లో నెట్టుకునే వారి నుంచి విముక్తి కలిగించేందుకు 1098లేదా100 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
ఐదు బృందాల ఏర్పాటు…
జిల్లా బాలకార్మికులను గుర్తించేందుకు ప్రభుత్వం ఐదు బృందాలను ఎస్పీ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. అధికారులు తమ బృందం సభ్యులతో పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, కుటీర పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, ఇండ్లల్లో పనిచేసే ప్రాంతాల్లో గుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సబ్ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన ఒక్కో బృందంలో ఎస్ఐ ర్యాంక్ అధికారి, ముగ్గురు పోలీసులు సిబ్బంది, పిల్లల సంరక్షణ ప్రతినిధులు, విద్యా, వైద్య శాఖల అధికారులు, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. 2015 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలో బాలలను గుర్తించి వారికి ఇష్టమైన విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 2019 నుంచి 2022 జూన్ వరకు గుర్తించిన బాలకార్మికులలో పాఠశాలలో 312 మంది, తల్లిదండ్రుల చెంతకు 112 మంది బాలలను చేరవేసి, మరోసారి పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇతర రాష్ర్టాల పిల్లలను గుర్తించి అప్పగింత..
బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక రాష్ర్టాల నుంచి తప్పించుకుని వచ్చిన బాలలు పలు దుకాణాలు, హోటళ్లలో పనిచేస్తున్న వారిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించి, 18 ఏండ్లలోపు పిల్లలతో పని చేయించొద్దని అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వసతిగృహంలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాలు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్లు, పశువుల కాపర్లుగా, మెకానిక్ షాపులు, పరిశ్రమల్లో పనికి పెట్టుకుంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.