సాధారణ ప్రసవానికి సకల యత్నాలు
గర్భిణుల్లో సిజేరియన్ తగ్గించడానికి చర్యలు
వైద్య సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు
ఆశ కార్యకర్తలకు మిడ్వైపరీపై ప్రత్యేక శిక్షణ తరగతులు
దవాఖానల్లో గర్భిణులకు ఎక్సర్సైజ్లు
సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న నార్మల్ డెలివరీలు
కాసుల కక్కుర్తితో ప్రైవేట్ దవాఖానలు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్న క్రమంలో ఆపరేషన్తో భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులను మరింత పెంచేందుకు ముందు నుంచీ గర్భిణులను సంసిద్ధం చేస్తున్నది. సాధారణ ప్రసవానికి దోహదపడే యోగాసనాలపై పీహెచ్సీ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారి ద్వారా జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు నేర్పించింది. వారంతా క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు.
అత్యాధునిక ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. సర్కారు దవాఖానలకు నమ్మకం ఏర్పడింది. ఔట్, ఇన్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రసవాలు కూడా భారీగా పెరిగాయి. గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడం, కేసీఆర్ కిట్తోపాటు వివిధ సౌకర్యాలు కల్పించడంతో సర్కారు దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సిజేరియన్తో కలిగే అనర్థాలను నివారించి సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. పలు యోగాసనాలు, ఎక్సర్సైజులు చేయిస్తున్నారు.
సిద్దిపేట, జూలై 15 : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు సాధారణ కాన్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణ కాన్పులను ప్రోత్సహించే లక్ష్యంతో అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న మిడ్వైపనరీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లోని నర్సులకు శిక్షణనిస్తున్నది. మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సాధారణ ప్రసవాలకు సంబంధించిన విషయాలను మహిళలకు చెబుతూ వారిని చైత న్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే స్టాఫ్ నర్సులతో పాటు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణను ఇచ్చింది.
సగానికి పైగా సాధారణ కాన్పులే..
జిల్లాలోని గత మూడు నెలల్లో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులే ఎక్కువగా జరిగాయి. ఏప్రిల్ నెలలో 868 డెలివరీలు కాగా, అందులో 400 సాధారణ ప్రసవాలు, మే నెలలో 899 డెలివరీలు జరుగగా, 452 సాధారణ, జూన్ నెలలో 890 కాన్పులు జరిగితే, 429 సాధారణ ప్రసవాలు అయ్యా యి. ప్రైవేటు దవాఖానల్లో ఏప్రిల్ నెలలో 385 ప్రసవాలు జరిగితే, 55 నార్మల్ డెలివరీలు, మే నెలలో 337 ప్రసవాలు జరిగితే, 51 సాధారణ, జూన్ నెల లో 325 ప్రసవాలు జరిగితే, కేవలం 50 నార్మల్ డెలివరీలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య పెరుగడమే కాకుండా సాధారణ ప్రసవాలూ పెరిగాయి.
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం
సాధారణ ప్రసవాలను పెంచి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ డెలివరీ చేయించేలా అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న మిడ్వైపరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జూన్ మాసం నుంచి జిల్లాలో కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 5 నెలల గర్భిణి నుంచి 9 నెలలు నిండి, ప్రసవమయ్యే రోజు వరకు నిత్యం చిన్నచిన్న వ్యాయామాలు చేయిస్తున్నారు. ఇందులో బాల్ ఎక్సర్సైజ్, వాకింగ్, సిట్టింగ్, త్రెడ్ సహాయంతో వ్యాయా మం చేయడంతో పాటు చిన్న యోగాసనాలు వేయిస్తున్నారు. దీంతో గర్భిణులకు సాధారణ ప్రసవాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోల సహాయంతో ప్రతి గ్రామంలోని ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు గర్భిణులకు వివరించి, వ్యాయామాలు ఆసనాలు నేర్పుతున్నారు. సిద్దిపేట ఎంసీహెచ్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి, గర్భిణులకు శిక్షణ ఇస్తున్నారు.
నాడు అత్యవసరమైతే తప్పా..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేడు గర్భిణులు సిజేరియన్కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముహూర్తాలు.. మంచి శకునాలు.. తిథులు చూసుకొని మరీ డెలివరీలు చేయించుకుంటున్నారు. కానీ, గతంలో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. అత్యవసరమైతే తప్పా, ఆపరేషన్ చేయించేవారు కాదు.. కానీ, నేడు సాధారణ కాన్పు అయ్యిందంటేనే.. అవునా..! అనే రోజులు వచ్చాయి. మరి సిజేరియన్ చేయడంతో తల్లితో పాటు బిడ్డలకు భవిష్యత్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. సాధారణ ప్రసవాలే మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సిజేరియన్ చేసేటప్పడు వెన్ను ముకకు మత్తు మందు ఇస్తారు.. దీంతో భవిష్యత్లో నడుము నొప్పి వస్తుంది. బిడ్డ పుట్టిన తొలిగంటలో బిడ్డకు తొలి గంటలో ముర్రుపాలు పట్టించాలి. ఆపరేషన్ కావడంతో తల్లి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో బిడ్డకు ముర్రుపాలు పట్టడం లేదు. ముర్రుపాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు పెంచేందుకు మిడ్వైపరీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సాధారణ ప్రసవాలే లక్ష్యం
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలే లక్ష్యంగా జిల్లాలోని 800 మంది ఆశ వర్కర్లకు మిడ్వైపరీ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చాం. గర్భిణులకు నిత్యం ఎక్సర్సైజ్లు, చిన్నచిన్న ఆసనాలు చేయిస్తున్నారు. గర్భిణులకు వాకింగ్, సిట్టింగ్ వంటి వ్యాయామాలు చేయిస్తున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేకంగా వీడియోలు రూపొందించాం.
– డాక్టర్ కాశీనాథ్, డీఎంహెచ్వో, సిద్దిపేట