ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ తొలిమెట్టు అనే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలు చేస్తారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ‘తొలిమెట్టు’ను అమలు చేయనుండగా.. విద్యా సంవత్సరం పొడవునా కొనసాగనున్నది. వారంలో ఐదు రోజులు పాఠాల బోధనకు.. ఆరో రోజు విద్యార్థుల సాధనకు కేటాయిస్తారు. నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉపాధ్యాయులకు విడుతల వారీగా శిక్షణ ఇస్తారు. జిల్లాలో 767 ప్రైమరీ స్కూళ్లు, 116 యూపీఎస్లు, 48 ఉర్దూ మీడియం పాఠశాలలుండగా.. 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులు 51,345 మంది ఉన్నారు.
బొంరాస్పేట, జూలై 29 : గత ఏడాది నిర్వహించిన జాతీయ సాధన సర్వే(నేషనల్ అచీవ్మెంట్ సర్వే)లో ప్రాథమిక తరగతుల విద్యార్థులు కనీస ప్రమాణాలు సాధించలేకపోయారని తేలింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో అభ్యసన ఫలితాలను సాధించడంలో వెనుకబడ్డారు. గతంలో పాఠశాల విద్యాశాఖ త్రీఆర్స్(చదవడం, రాయడం, లెక్కలు చేయడం) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసినా ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ విషయంపై ఆలోచించిన విద్యాశాఖ ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో భాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి ‘తొలిమెట్టు’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రణాళిబద్ధంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలు చేస్తారు. విద్యార్థి కనీస సామర్థ్యాలను సాధించేలా చేసి తరగతులవారీగా ఆశించిన ఫలితాలను సాధించడమే దీని లక్ష్యం. విద్యా సంవత్సరంలో 220 పనిదినాలకు 140 రోజుల్లో ప్రతి విద్యార్థికి కనీస సామర్థ్యాలను సాధించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుంది. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి వారంలో ఐదు రోజులపాటు చెప్పిన పాఠాలను ఆరో రోజు విద్యార్థుల సాధన మదింపునకు కేటాయిస్తారు.
బోధనా ప్రణాళికలో మార్పులు
ఇదివరకు పాఠం పూర్తయిన తరువాత మదింపు నిర్వహించేవారు. పాఠశాలల వార్షిక బోధనా ప్రణాళికలో కూడా ఉపాధ్యాయులు తగిన మార్పులు చేసుకోవాలి. అర్థవంతంగా కృత్యాధార పద్ధతుల్లో విద్యార్థులందరూ భాగస్వాములయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఉపాధ్యాయులకు కరదీపిక అందిస్తూ సమయసారిణి పేర్కొంటారు. ప్రతి నెలా 27న, ఆ రోజు సెలవు దినమైతే మరునాడు పాఠశాలస్థాయిలో, రెండు నెలలకోసారి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమంపై అధికారులు సమీక్ష నిర్వహించి పనితీరును మదింపు చేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఎంఈవోలు, నోడల్ అధికారులు, పాఠశాల సముదాయాల హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని సెక్టోరియల్ అధికారి తరచూ పాఠశాలలను సందర్శించి కార్యక్రమ అమలును పరిశీలిస్తారు.
ప్రత్యేక రిజిస్టర్
కార్యక్రమం అమలులో భాగంగా విద్యార్థుల వివరాల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు ఈ వివరాల నమోదుకే ప్రాధాన్యమిస్తారు. విద్యా సంవత్సరం మొదట్లో ప్రారంభ పరీక్ష ముగింపు రోజు అంత్య పరీక్ష నిర్వహించి తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తారు. పాఠ్య పుస్తకాల ఆధారంగా అభ్యసనా ఫలితాలను సాధించి నిత్య జీవితంలో వీటిని అభ్యాసం చేసేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తారు.
తరగతిని బట్టి సామర్థ్యాల సాధన
తొలిమెట్టులో ఏ తరగతికి ఏ సామర్థ్యాలు సాధించాలో విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఒకటో తరగతి విద్యార్థులు తెలుగులో వర్ణమాల, సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రెండో తరగతిలో వీటికి తోడుగా ఒత్తుల అక్షరాలు చదవడం, రాయడం రావాలి. మూడో తరగతిలో వీటితో పాటు నాలుగైదు వాక్యాలతో కూడిన పేరాలను రాయగలగాలి. నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు సొంత మాటల్లో రాయడం, అపరిచిత పేరాలను, వాక్యాలను చదవడం, అర్థం చేసుకోవడం, ఐదారు వాక్యాల పేరాలను సొంతంగా రాసే సామర్థ్యం వచ్చేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ఆర్పీలకు శిక్షణ ఇస్తున్న అధికారులు
72 మంది ఆర్పీలకు శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమంపై వికారాబాద్ జిల్లాలోని 19 మండలాలకు చెందిన 72 మంది రిసోర్స్ పర్సన్లకు గురువారం జిల్లాలో శిక్షణ ఇచ్చారు. జిల్లాలో శిక్షణ పొందిన ఆర్పీలు ఈ నెల 30 నుంచి మండలస్థాయిలో ఉపాధ్యాయులకు ఆగస్టు 11 వరకు విడుతలవారీగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆగస్టు 15నుంచి తొలిమెట్టును అమలుచేసి విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన సామర్థ్యాలను సాధించడానికి కృషి చేస్తారు. తొలిమెట్టు కార్యక్రమం ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం రూపొందించారు. జిల్లాలో 767 ప్రాథమిక పాఠశాలలు, 116 యూపీఎస్లు, 48 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉండగా.. వీటిలో 1 నుంచి 5వ తరగతి వరకు 51 వేల 345 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కార్యక్రమంతో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ ఆశిస్తున్నది.
గతంలో కంటే భిన్నంగా ఉంది
– బాకారం చంద్రశేఖర్, రిసోర్స్ పర్సన్
తొలిమెట్టు కార్యక్రమం గతంలో కంటే భిన్నంగా ఉంది. గతంలో త్రీ ఆర్స్, ఏబీసీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవి కేవలం గణిత సామర్థ్యాలను సాధించడంపైనే దృష్టి పెట్టారు. తొలిమెట్టు కార్యక్రమంలో ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలను సాధించేలా చేసి తరగతులవారీగా ఆశించిన ఫలితాలను సాధించే లక్ష్యంతో దీనిని చేపట్టారు. దీనిపై మాకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
పకడ్బందీ అమలుకు చర్యలు
– రవికుమార్, సెక్టోరియల్ అధికారి, డీఈవో కార్యాలయం
ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే తొలిమెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని 72 మంది రిసోర్స్ పర్సన్లకు దీనిపై శిక్షణ ఇచ్చాం. శనివారం నుంచి ఆగస్టు 11 వరకు మండలాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించేలా కృషి చేస్తున్నాం.