ప్రభుత్వానికి అండగా ఉంటాం
పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల హర్షం
రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబురాలు
సీఎం కేసీఆర్కు ఉద్యోగుల ధన్యవాదాలు
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అంచనాలకు మించి పీఆర్సీని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల ఆత్మబంధువు అని మరోసారి నిరూపించుకున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతోపాటు ఇతర నిర్ణయాలు ఉద్యోగులకు, కుటుంబాలకు భరోసా ఇచ్చాయని పేర్కొన్నాయి. తాము రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని, ప్రభుత్వానికి అండగా ఉంటామని స్పష్టంచేరు. సోమవారం సీఎం కేసీఆర్ 30శాతం పీఆర్సీ ప్రకటించగానే యావత్ ఉద్యోగ, ఉపాధ్యాయలోకం సంబురాల్లో మునిగితేలింది. రాష్ట్రవ్యాప్తంగా పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపట్టాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నాయకులు, అసెంబ్లీ ఉద్యోగులు, అసెంబ్లీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శాసనసభలో సీఎం కేసీఆర్ను ఆయన చాంబర్లో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ను కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల పట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి, మానవత్వానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు భావొద్వేగానికి లోనయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసినవారిలో మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సబిత, తలసాని, సత్యవతి, విప్లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రేఖానాయక్, దానం నాగేందర్, సుదీర్రెడ్డి, మాగంటి గోపినాథ్, బేతి సుభాష్రెడ్డి, మెతుకు అనంద్, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, ముఠా గోపాల్, ప్రకాశ్గౌడ్, జైపాల్యాదవ్, మాధవరం కృష్ణారావు, వనమా వెంకటేశ్వర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, మాణిక్రావు, క్రాంతి కిరణ్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి కమలాకర్రావు, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి గౌతమ్కుమార్ ఉన్నారు.
స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు
తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని హోంగార్డులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తంచేశారు. టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీటీయూ, ఆర్యూపీపీ తదితర ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీని స్వాగతించాయి.
ఉద్యోగుల సమస్యలపై అవగాహన
ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉన్నది. అందుకే వారు అడిగినంత ఫిట్మెంట్ను ప్రకటించారు. ఉద్యోగులతో కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నది.
అడిగిన దానికంటే ఎక్కువే..
ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కువ ఫిట్మెంట్ను సీఎం ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వర్తింపజేయడం, ఉద్యోగ విరమణ వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచిన సీఎంకు ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు.
ఉద్యోగ సమాజంలో సంతోషం
30 శాతం ఫిట్మెంట్తోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంచడంపట్ల ఉద్యోగ సమాజం సంతోషంగా ఉన్నది. అంతర్ జిల్లాబదిలీలు,కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయడం హర్షించదగిన విషయం.
-ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయస్సు పెంచి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఉన్న పేగు బంధాన్ని ఎవరూ తెంపెయ్యలేరు.
-పువ్వాడ, రవాణాశాఖ మంత్రి
ఉద్యోగుల పక్షపాతి కేసీఆర్
ఫిట్మెంట్, పదవీ విరమణ వయస్సు పెంచి సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అనిపించుకొన్నారు. ప్రాథమిక పాఠశాల లకు హెచ్ఎం పోస్టుల మంజూరుతో అవి బలోపేతం కానున్నాయి.
-ఇంద్రకరణ్రెడ్డి, అటవీశాఖ మంత్రి
ఊహించిన దానికంటే ఎక్కువే
ఉద్యోగ విరమణ వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచి సీఎం కేసీఆర్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా 30 శాతం ఫిట్మెంట్ను ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు మరిచిపోలేని పీఆర్సీ
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరిచిపోలేని విధంగా 30 శాతం పీఆర్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
-కొప్పుల, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి
అంగన్వాడీలకు పెద్దన్నలా..
30 శాతం ఫిట్మెంట్, 61 ఏండ్లకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం తదితర నిర్ణయాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సంబురపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించే అంగన్వాడీలకు మరోసారి జీతాలు పెంచి సీఎం కేసీఆర్ వారికి పెద్దన్నలా నిలిచారు.
-సత్యవతిరాథోడ్, గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి
మాట నిలుపుకున్నారు
ఇతర రాష్ర్టాల ప్రజలు, ఉద్యోగులు మాతో కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు.. కేసీఆర్ పాలనలో మీరు ఉండటం అదృష్టం అని పొగుడుతుంటారు. అది నిజమని సీఎం కేసీఆర్ మరోమారు నిరూపించారు. పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచి మాట నిలుపుకున్నారు.
ఉద్యోగులపై ప్రశంసలు అభినందనీయం
ఉద్యమంలో వేధింపులు తట్టుకొని ఉద్యోగులు ముందు నిలిచారని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కొనియాడటం అభినందనీయం. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోంగార్డులకు పీఆర్సీ వర్తిస్తుండటం సంతోషకరం.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ చరిత్రాత్మకం
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. గత ప్రభుత్వాలు, పాలకులు ఎన్నడూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-గాదె వెంకన్న, ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు