అనేక రంగాల్లో పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్పై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేలా, కొత్త మెరికలను సిద్ధం చేసేలా గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఆ మేరకు ప్రతి ఊళ్లో ఎకరం నుంచి ఎకరన్నర విస్తీర్ణంలో స్టేడియాలను తీర్చిదిద్దనున్నది. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు తాసీల్దార్లు అనువైన స్థలాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా, ఇప్పటికే 275 పంచాయతీల్లో పూర్తి చేశారు. మిగిలిన చోట్ల అన్వేషణ కొనసాగుతున్నది. పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరనున్నది.
భువనగిరి కలెక్టరేట్, మే 18 : రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పల్లెల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించిన సర్కారు.. ప్రస్తుతం గ్రామ యువత క్రీడల్లో రాణించేలా తీర్చి దిద్దే విషయమై దృష్టిసారించింది. వారి కోసం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో అనువైన స్థలాల కోసం అధికారులు అన్వేషణ మొదలు పెట్టారు. తాసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఎకరం నుంచి ఎకరంన్నర ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తున్నారు. దానిని క్రీడా స్థలంగా మార్చనుండగా..యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.
అనువైన స్థలాల గుర్తింపు
ప్రతి గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా.. క్రీడా మైదానాల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాసీల్దార్ల నేతృత్వంలో రెవెన్యూ అధికారులు వేట మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 275 గ్రామ పంచాయతీల్లో స్థలాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ మార్గ దర్శకాలు, అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు తాసీల్దార్లు కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ఎకరం నుంచి ఎకరంన్నర చదునైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నారు. సంబంధిత స్థలాన్ని డీఆర్డీఏ ద్వారా అభివృద్ధి చేసి అన్ని రకాల క్రీడలకు అనువుగా, యువత ఆటలు ఆడుకునేందుకు వీలుగా రూపొందించనున్నారు.
గ్రామీణ క్రీడాకారులకు వరం
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత, క్రీడాకారులు ఆటలాడేందుకు, పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రాక్టీస్ కోసం అనువైన స్థలం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ పట్టణ ప్రాంతాలకు వచ్చి ప్రాక్టీస్ చేయాల్సి వస్తున్నది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుండడంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. ఇందులో వివిధ క్రీడలకు అవసరమైన వసతులు కూడా కల్పించనున్నందున గ్రామీణ క్రీడాకారులు ఆటల్లో రాణించేందుకు అవకాశం ఏర్పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
స్థలాలను గుర్తిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలను క్రీడా ప్రాంగ ణాల కోసం గుర్తిస్తున్నాం. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో 275 గ్రామాల్లో చదునైన స్థలాలను గుర్తించాం. మిగిలిన 146 గ్రామ పంచాయతీల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
– డీఆర్డీఓ మందడి ఉపేందర్రెడ్డి