నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.. గ్రామాలను నదినీ ఒక్కటి చేసింది.. వేలాది గృహాలను ముంచింది.. పంట పొలాలను కబళించింది.. వరదల కారణంగా 16,044 కుటుంబాలు ప్రభావితమయ్యాయి.. సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు ముంపు ప్రాంతాల్లో సర్వే చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. బాధితుల బ్యాంకు ఖాతాల్లో త్వరలో మొత్తం రూ.16 కోట్లు జమకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గోదావరి వరదలు భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ప్రజలను అతలాకుతలం చేసింది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు ముంపు ప్రాంతాల్లో సర్వే చేపట్టి మొత్తం 16,044 మంది కుటుంబాలు వరదలకు ప్రభావితమయ్యాయని గుర్తించారు. ఇప్పటికే నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. బాధితుల ఖాతాల్లో మొత్తం రూ.16 కోట్లు జమకానున్నాయి.
బాధితుల ఖాతాల్లోనే సొమ్ములు..
పరిహారం పంపిణీలో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తున్నది. సరాసరి బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే సొమ్ములు జమ చేయనున్నది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందించారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని అశ్వాపురం మండలంలో 1,535 కుటుంబాలు, భద్రాచలం 1,431, చర్ల 2,289, దుమ్ముగూడెం 1,936, మణుగూరు 392, పినపాక 1,353, బూర్గంపాడు మండలంలో 7,108 కుటుంబాలు ముంపునకు గురైనట్లు నిర్ధారణ అయింది. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేల చొప్పున సాయం అందనున్నది. మరోవైపు వరదల సమయంలో భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం కోసం రూ.వెయ్యి కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు, కరకట్ట నిర్మించి వరద ప్రమాదం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. మున్ముందు ఆ హామీలన్నీ నెరవేరనున్నాయి.
నిత్యావసరాల పంపిణీ..
ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు తమ వంతు సాయం అందించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వందలాది మంది బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వంతుగా ముంపు ప్రాంతాల్లో నిత్యావ సరాలు పంపిణీ చేశారు.
వేలాది మందికి పునరావాసం..
గోదావరి వరదల కారణంగా జిల్లాపరిధిలోని ఏడు మండలాల్లో 74 గ్రామాలు ప్రభావితమయ్యాయి. మంత్రి అజయ్కుమార్, కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాచలంలోనే మకాం వేసి అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతవాసులను క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. మారుమూల ముంపు గ్రామాల ప్రజలకు హెలికాఫ్టర్ ద్వారా సరుకులు చేరవేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. వరదల సమయంలో కొట్టుకుపోయిన రహదారులకు అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగి మరమ్మతులకు గురైన చోట విద్యుత్శాఖ అధికారులు కొత్తవి బిగించారు. కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ప్రాణ నష్టాన్ని నివారించాం..
గోదవరి వరదల సమయంలో వారం రోజుల పాటు భద్రాచలంలోనే మకాం వేశాం. అధికారులను అప్రమత్తం చేశాం. ప్రజాప్రతినిధుల సహకారంతో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త వహించాం. ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచింది. ఎక్కడా ఎవరికీ లోటు రానీయలేదు. పునరావాస కేంద్రాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పించాం. భద్రాచలం రామాలయం పరిసరాల్లో చేరిన వరద నీటిని పెద్ద మోటర్లతో నదిలోకి మళ్లించాం. హెలికాఫ్టర్ ద్వారా ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపించాం.
– అనుదీప్, భద్రాద్రి కలెక్టర్