హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రాష్ట్రంలోని 1,530 మంది గోపాలమిత్రలకు లబ్ధి చేకూరనున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడంలో గోపాలమిత్రలు చేస్తున్న కృషిని అభినందించారు.
ప్రస్తుతం గోపాలమిత్రలకు రూ.8,500 చెల్లిస్తుండగా ఇకపై రూ. 11,050 వేతనం అందనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకుముందు గోపాలమిత్రలకు రూ.3,500 పారితోషికాన్ని అందించేవారని పేర్కొన్నారు. గోపాలమిత్రల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఒకేసారి రూ.8,500 వేతనం పెంచినట్టు తలసాని వివరించారు. దేశంలో మరెక్కడ కూడా గోపాలమిత్రలకు ఈ స్థాయిలో వేతనాలు ఇవ్వడం లేదన్నారు. 2019 నుంచి 14 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించడమైందని, ఇందులో గోపాలమిత్రలది కీలక పాత్ర అని తెలిపారు. గోపాలమిత్రలకు 30 శాతం వేతనాలు పెంచడంపై ఆ సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.