వందల ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని పార్లమెంట్ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ సందర్శించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఆధునీకరించిన పిల్లలమర్రి జంక్షన్ను మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. స్లైన్ బాటిళ్లతో ప్రత్యేక ట్రీట్మెంట్ అందించి జీవం పోయడం అభినందనీయమని, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, అధికారులు, సిబ్బందిని అభినందించారు. పిల్లలమర్రి సంరక్షణకు రూ.2కోట్లు కేటాయిస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రాత్మకమైన పిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించేందుకు రూ. 2కోట్లు నిధులు మంజూరు చే స్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు, గ్రీన్ ఇండియా చా లెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ ప్రకటించా రు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద పిల్లలమర్రి జంక్షన్ ఆధునీకరణ పనుల ను మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మంత్రితో కలిసి మీడియాతో మాట్లాడుతూ పిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించే చ ర్యలు అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలో వచ్చినతర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొ రవ తీసుకొని సంరక్షణకు నడుం బిగించడం అభినందనీయమన్నారు. స్లైన్ బాటిళ్లతో ప్రత్యేక ట్రీట్మెంట్ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతి వేరును ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ తిరిగి ప్రాణం పోసిన అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా
ఎవరూ అడ్డుకోలేరు : మంత్రి శ్రీనివాస్గౌడ్
‘కేసీఆర్ సంకల్పం..ఆలోచన చాలాగొప్పది.. గొప్ప సంకల్పం ఉన్న వాళ్లను ఎవరూ ఆపలేరు.. అలాంటి వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి.. ఆయ న్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు’ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పిల్లలమర్రి మహావృక్షాన్ని ఎంపీ సంతోష్కుమార్తో కలిసి సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని దేశమంతా గుర్తిస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని, దేశ రాజకీయాల్లో వస్తే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు అవుతాయన్నారు. కేసీఆర్ విజన్ ఒక్క తెలంగాణకే కాకుండా దేశమంతటికీ అవసరమని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మంచి మనస్సుతో హరితహారం కార్యక్రమాన్ని ఏ ముహుర్తానా ప్రారంభించారో కాని అప్పటి నుంచి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పచ్చగా మారుతుందన్నారు. గతేడాది పచ్చదనంలో భాగంగా కోటి సీడ్బాల్స్ను వెదజల్లడం ద్వార పచ్చదనం పెరిగిందన్నారు. ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకుని 10రోజుల్లో మహిళా సంఘాలు రెండుకోట్ల 8వేల సీడ్బాల్స్ను తయారు చేసి గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారన్నారు. ఈ రికార్డులను మళ్లీ తామే బద్దలు కొడ్తామన్నారు. పిల్లల మర్రిని ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ నిధుల నుంచి రెండు కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద మహావృక్షం ఇదేనన్నారు.
ఎంపీతో కలిసి మంత్రి సెల్ఫీ
రూ.30 లక్షల వ్యయంతో మెట్టుగడ్డ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పిల్లలమర్రి స్మారకాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించారు. అనంతరం అక్కడే ‘మన మహబూబ్నగర్’ సెల్ఫీ పాయింట్ను సందర్శించి సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, శాట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్నతో కలిసి సె ల్ఫీ దిగారు. అనంతరం పిల్లల మర్రి వద్ద మంత్రి ఎంపీ లు కలిసి ప్రత్యేకంగా ఫొటోషూట్లో పాల్గొన్నారు. మహావృక్షాన్ని కాపాడిన తీరును అధికారులు ఫొటో ఎగ్జిబిషన్తో ప్రదర్శించారు. పిల్లలమర్రి ఆవరణలోని మ్యూజియాన్ని సందర్శించారు. పాలమూరు పర్యటన ఫొటోలను ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, రైతుబంధు సమితి జిల్లాధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, పార్టీ నాయకులు బుక్కామెహన్బాబు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.