కుండపోత వానలు అనేక మందికి గుండె కోతను మిగిల్చాయి.. ఉమ్మడి జిల్లాలో వందలాది ఇండ్లు కూలిపోయాయి. గూడు కోల్పోయిన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా కొండంత ఆసరాగా ఉంటున్నారు. కూడు, గుడ్డ అందిస్తూ, కష్టాల్లో తాము తోడున్నామనే భరోసా కల్పిస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఆపత్కాలంలో కొండంత అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 15 : ఉమ్మడి జిల్లాలో వారంపాటు కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు పలు పట్టణాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదదాటికి ఇండ్లలోకి నీళ్లు చేరాయి. పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయి. నిరాశ్రయులైన ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించాయి. అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజన వసతులను కల్పిస్తుండగా, పలువురు ఆర్థికసాయం, సామగ్రి అందజేశారు. సామాజిక దృక్పథంతో పలువురు అధికారులు సైతం సేవలందించి ప్రజల మన్ననలు పొందారు.
అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు
ఖలీల్వాడి, జూలై 15: జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో నిరాశ్రయులైన ప్రజలకు అండగా నిలిచారు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం సైతం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారికి భోజన వసతి కల్పించి ఆదుకున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాలతో తెలంగాణ జాగృతి నాయకులు ముంపు బాధితులకు భోజన సహాయం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహార పొట్లాలను పంపించారు. నగరంలోని సారంగాపూర్ రాయల్ ప్యాలెస్లో 300 మందికి, ఇంపీరియల్ గార్డెన్లో 198, వినాయక్నగర్లోని బింగి ఫంక్షన్హాల్లో 300 మందికి అధికారులు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్రెడ్డి, షకీల్ నిరంతరం అధికారులతో సమీక్షిస్తూ ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు.
బోధన్లో పునరావాస కేంద్రం..
ఇండ్లు కూలిన 29 మందికి ఆశ్రయం
బోధన్, జూలై 15: బోధన్ పట్టణంలో ఇండ్లు కూలి నిరాశ్రయులుగా మారిన 29 మందిని బీటీనగర్ పాఠశాలలోని పునారావాస కేంద్రానికి తరలించారు. బోధన్ మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఉదయం టీ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు. ఇండ్లు కూలిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అందించిన సాయంపై కేంద్రంలో ఉన్నవారు ఊరట చెందారు.
మమ్మల్ని ఆదుకున్నారు.
వానలు ఇంతపెద్దగా పడుతాయనుకోలేదు. మా ఇండ్లు కూలిపోయి రోడ్డుమీద నిలుచునే పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు మా కూలిన ఇండ్లు చూసి వెంటనే ఈ సెంటర్కు పంపి ఆదుకున్నారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు.
– చింతల పోశెట్టి, బీటీనగర్, బోధన్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
భారీ వర్షంతో మేముండే ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అధికారులు వెంటనే వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మూడు రోజుల నుంచి టిఫిన్లు, భోజనం పెడుతున్నారు. పడుకోవడానికి దుప్పట్లు కూడా ఇచ్చారు. ఇన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ప్రియాంక, బాధితురాలు
198 మందికి వసతి కల్పించాం..
నిజామాబాద్ ముంపు ప్రాంతాల వారికి ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ 198 మందికి వసతి, భోజన సౌకర్యం కల్పించాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సురక్షిత ప్రాంతాల్లో ఉంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం.
– సంధ్యారాణి, వీఆర్వో, గూపన్పల్లి
మూడు పూటలా అన్నం పెట్టారు..
వరదలో మా సామాన్లు కొట్టుకుపోయాయి. మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాం. ప్రభుత్వం అండగా నిలిచింది. మూడు పూటలా అన్నం పెడుతున్నారు. ఏ లోటూ లేకుండా చూస్తున్నారు. – శ్యామల, గూపన్పల్లి
భారీ వర్షంలో సహాయక చర్యలు
శభాష్ పోలీసన్న అంటూ ప్రశంసలు
బోధన్, జూలై 15: బోధన్ మున్సిపల్ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో వర్షంతో పలు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న సీఐ ప్రేమ్కుమార్ తనవంతుగా టార్పాలిన్లు అందజేసి పూరిగుడిసెలపై వేయించారు. మరో రెండు, మూడు కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. బోధన్ నుంచి పెగడాపల్లి వెళ్లే రహదారి లంగ్డాపూర్ వద్ద కోతకు గురైన విషయం తెలుసుకున్న సీఐ ప్రేమ్కుమార్ సిబ్బందితో వెంటనే వెళ్లి ఇరువైపులా వాహనాలు రాకుండా నియంత్రించారు. బోధన్ పట్టణ సీఐ ప్రేమ్కుమార్ అందిస్తున్న సేవలను గుర్తిస్తున్న పలువురు ‘శభాష్ పోలీసన్న’ అంటూ అభినందిస్తున్నారు.
సరైన సమయంలో ఆదుకున్నడు..
నా కొడుకు కొండల పోశెట్టి ఆయన పిల్లలతోకలిసి గుడిసె లో ఉంటున్నాం. మస్తు రోజుల నుంచి వానలు పడుట్ల నీ ళ్లు ఇంట్లకి అచ్చినయ్. పై నుంచి వర్షం పడుట్ల మస్తు ఇ బ్బందిపడ్డం. అసొంటి టైంల పోలీసు సారు తాటిపత్రి కవ రు ఇచ్చిండు. మా గుడిసెపై కప్పుకున్నం. వర్షం నీళ్లు రాలే వు. మాకు సాయం చేసిన పోలీసు సార్కు నా ఆశీస్సులు. – గంగవ్వ, నర్సాపూర్
బాసర రోడ్డులో గుంతలు పూడ్చిన పోలీసులు
నవీపేట, జూలై 15: నవీపేట మండల కేంద్రంలోని బాసర వెళ్లే రహదారిపై వర్షందాటికి ధ్వంసమైన రోడ్డును పోలీసులు శుక్రవారం బాగుచేయించారు. రైల్వే గేటు సమీపంలో భారీ వర్షానికి పడిన గుంతలను ఎస్సై రాజారెడ్డి కంకర వేయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. బాసర వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంపై ప్రజలు అభినందించారు.
చెరువు బుంగ పూడ్చివేయించిన ఎస్సై, తహసీల్దార్
రుద్రూర్(వర్ని), జూలై 15: వర్ని మండలం జాకోరా గ్రామ చిన్న చెరువుకు పడిన బుంగను ఎస్సై అనిల్రెడ్డి, తహసీల్దార్ విఠల్ దగ్గరుండి పూడ్చివేయించారు. వారం రోజులుగా కురిసిన వర్షాలతో జాకోరా గ్రామానికి చెందిన చిన్న చెరువుకు బుంగ పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై అనిల్రెడ్డి, తహసీల్దార్ విఠల్, ఇరిగేషన్ అధికారి, గ్రామస్తుల సహకారంతో బుంగను పూడ్చివేయించారు.