హైదరాబాద్, జులై 19 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలుస్తున్నది.
నిన్న మొన్నటి వరకు స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి, హరీశ్రావు, సత్యవతి రాథోడ్ వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. అధికారులతో సమీక్షలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు.
ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ కు వచ్చిన వెంటనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. మంత్రుల నివాసంలో వరద ముంపు ప్రాంతాల పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
ఇటీవల వర్షాలకు ఆతలాకుతలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీరాజ్ అధికారులను సహాయక చర్యల కోసం నియమించారు.
అలాగే ఫాగింగ్ వంటి యంత్రాలను పంపించారు. జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలు 45, ఆవాసాలు 96, ఉన్నట్లుగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
వర్షాలకు బాగా నష్టపోయిన బూర్గంపాడు, సారపాక, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం గ్రామాల తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ఆయా గ్రామాలకు ఇప్పటికే 5 డీపీఓలను, 21 మంది ఎంపీఓలను, 219 మంది పంచాయతీ కార్యదర్శులను, 4,100 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాం.
అలాగే 9 ఫాగింగ్ మిషన్లు, 60 చేతి ఫాగింగ్ మిషన్లు, 90 స్ప్రేయర్లు, 12 టిప్పర్లు, 170 ట్రాక్టర్లు, ట్రాలీలు, 4 బాబ్ క్యాట్స్, 12 జేసీబీలను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైన చర్యలు వెంట వెంట తీసుకోవాలని, ప్రజలను ముంపు పరిస్థితుల నుంచి సాధ్యమైనంత వేగంగా బయట పడేయాలన్నారు. బాధితులకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో రాజీ పడొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు.