హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్తగా పింఛన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 58 లక్షలకు పెరగనుంది.
కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్నివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షత ప్రగతి భవన్లో రాష్ట్రవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.