వరంగల్ రూరల్ : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేయూతనిస్తున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా రాష్ట్రంలో 3,80,162 స్వయం సహకార సంఘాలకు 12 వేల70 కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పించినున్నట్లు వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని కల్లెడ గ్రామంలో డీసీసీబీ పర్వతగిరి శాఖను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ. 15 కోట్ల బ్యాంక్ లింకేజీని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఎం. రవీందర్ రావుతో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు.
రాష్ట్రంలో సెర్ప్ ద్వారా గత ఏడేళ్లలో ఎస్హెచ్సీలకు 44,270 కోట్ల బ్యాంక్ లింకేజీని కల్పించినట్లు వెల్లడించారు. మహిళ సంఘాలు తీసుకునే రుణాలకు వడ్డిని ప్రభుత్వమే చెల్లిస్తున్నదని, అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవల తొలివిడతగా రూ. 200 కోట్లను విడుదల చేశారని చెప్పారు. కల్లెడలో రూ. కోటి వ్యయంతో త్వరలో పీఏసీఎస్ గోడౌన్ నిర్మిస్తామన్నారు. అంతకుముందు వర్ధన్నపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుంజాలకుంట తండాలో మొక్కలను నాటారు. రూ. 4 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా సహాయక కేంద్ర బ్యాంకు చైర్మన్ ఎం రవీందర్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.