సంగారెడ్డి : గిరిజనుల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన గురుకుల న్యాయ కళాశాలను శనివారం ఆమె ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం ఏటా సుమారు రూ. 1200 కోట్లను ఖర్చు చేస్తున్నదని గుర్తుచేశారు.
ఈ రంగానికి ఇంతపెద్ద మొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు.
గిరిజన విద్యార్థులకు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేని అన్నారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కళాశాల ఇక్కడ ప్రారంభంకావడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వ కారణమని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన విద్యకు రూ.70 కోట్లు కేటాయిస్తే ప్రత్యేక రాష్ట్రంలో రూ. 570 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతి , భూపాల్ రెడ్డి , గిరిజన గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఉప కార్యదర్శి నవీన్ నికోలస్, కలెక్టర్ హన్మంత రావు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.