హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్’లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. సమష్టి కృషితో, పల్లెప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పునరుద్ఘాటించారు.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ కింద పలు విభాగాల్లో రాష్ట్రం 13 అవార్డులు దకించుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు దోహదం చేసిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిని, ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామకార్యదర్శులను సీఎం కేసీఆర్ అభినందించారు. ‘అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తనవంతుగా గుణాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’ అని అన్నారు.
ఎర్రబెల్లికి ఫోన్లో అభినందనలు
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్లో తెలంగాణ ఆగ్రస్థానంలో నిలిచినందుకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం ఫోన్ చేసి అభినందించారని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినందుకు కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారని, ఇదే తరహా అభివృద్ధిని కొనసాగించాలని సూచించారని చెప్పారు.