హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గత వేసవిలో అనేక రాష్ర్టాలు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధించినా తెలంగాణలో మాత్రం వెలుగులు విరజిమ్మాయి. ఇందుకు కారణం గత ఎనిమిదేండ్లుగా ఆ రంగం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ, నిబద్ధతలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, పంపిణీ వ్యవస్థను పటిష్టపర్చడం, పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
గత ఎనిమిదేండ్లలో రూ.37,099 కోట్లు ఖర్చు పెట్టి పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడంతో విద్యుత్తు రంగంలో తెలంగాణ రారాజుగా వెలుగొందుతున్నది. రాష్ట్రంలోని వినియోగదారులు అందరికీ ఏమాత్రం కోతలు, పవర్హాలిడేలు లేకుండా 24 గంటలపాటు నాణ్యమైన కరెంటును అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా విరాజిల్లుతున్నది. ట్రాన్స్కో, డిస్కంల ద్వారా విద్యుత్తు డిమాండ్, అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సబ్ స్టేషన్లను నిర్మించి, పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచారు. దీంతో 14,160 మెగావాట్ల పీక్ డిమాండ్ను సైతం రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థ తట్టుకోగలిగింది.
ఒకనాడు వ్యవసాయరంగానికి ఆరేడు గంటలు విద్యుత్తు సరఫరా చేయడమే గగనం కాగా సీఎం కేసీఆర్ ప్రదర్శించిన పట్టుదల, నిబద్ధతతో 2018 జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండటం విశేషం. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు రూపంలో గత ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన సబ్సిడీల మొత్తం రూ.36,890 కోట్లు. రైతుల సంక్షేమం కోసం కేవలం విద్యుత్తు మీదనే ఇంత మొత్తంలో వెచ్చించిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్న ప్రభుత్వం ఆయా వర్గాలకు రూ.656 కోట్లు లబ్ధి చేకూర్చింది.
విద్యుత్తు రంగంలో తెలంగాణ సాధించిన ఘనతలు